YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైడ్రాను అడ్డుకుంటే ఎవరికి నష్టం...

హైడ్రాను అడ్డుకుంటే ఎవరికి నష్టం...

హైదరాబాద్, సెప్టెంబర్ 27,
నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసింది. ఎంత అంటే.. ఎప్పుడూ నీళ్లు చూడని రోడ్లు కూడా నదుల్లా పారాయి. పదుల సంఖ్యలో జనం కొట్టుకుపోయారు. హైదరాబాద్‌లోని సగం ఇళ్లు నీట మునిగాయి. అంత వరద వందేళ్లలో రాలేదని అప్పటి ప్రభుత్వం చెప్పింది. నాలాలు కబ్జాకు గురయ్యాయని.. చెరువుల్ని కబ్జా చేశారని అన్నింటినీ క్లియర్ చేసి..మరోసారి అలాంటి  పరిస్థితి రాకుండా చూస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూల్చివేతల్ని వ్యతిరేకిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తోందని అంటోంది. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని చెబుతోంది. అంటే కబ్జాలు చేసిన వాళ్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందా ?. ఇదే సపోర్టు ఉంటే.. మరతంగా కబ్జాలు పెరగవా ?. దీని వల్ల ఇతర ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుందా ? హైడ్రా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రైవేటు ల్యాండ్స్ లో కూల్చివేతలు చేపట్టలేదు. ప్లాన్ ప్రకారం కట్టలేదనో మరో కారణమో చూపి కూలగొట్టలేదు. అంటే ప్రైవేటు ఆస్తుల జోలికి వెళ్లలేదు. ఎక్కడ కూలగొట్టిన చెరువులు, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేసి కట్టిన వాటినే కూలగొట్టారు. అక్కడ కబ్జా చేసి అమ్ముకున్న వాళ్లు పరారయ్యారు. కొనుకున్న వాళ్లు నష్టపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం వారికి ఏమైనా న్యాయం చేస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ అంశంపై  ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కానీ.. కూల్చి వేతల్ని ప్రశ్నిస్తే కబ్జాల్ని సమర్థించినట్లే అవుతుంది. దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లో కూడా అనేక  సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హైడ్రా ఇప్పటికీ నివాసం ఉన్న ప్రాంతాలను కూలగొట్టడం లేదని.. వారికి సమయం ఇస్తామని చెబుతోంది. కొత్తగా నిర్మాణంలో ఉన్నవాటిని మాత్రం వదిలి పెట్టేది లేదని చెబుతోంది. గత పదేళ్ల కాలంలో చెరువులు, ప్రభుత్వ భూములు విపరీతంగా కబ్జా అయ్యాయి. ఇటీవల కిష్టారెడ్డిపేటలో కూల్చివేసిన ఇళ్లు ఉన్నది ప్రభుత్వ భూమే. అలా వదిలేస్తే కబ్జా దారులకు వదిలేసినట్లవుతుంది. ఆ ధైర్యంతో వారు మరిన్ని కబ్జాలు చేస్తారు. ఈ విషయంలో కిష్టారెడ్డి పేట లేకపోతే ఆ చుట్టపక్కల ప్రభుత్వానికి మద్దతే ఉంది. అవి ప్రభుత్వ భూములని తెలిసి కూడా చాలా మంది కొనుగోలు చేశారని ... మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తే తమ జోలికి రారన్నది వారి ధైర్యమని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో మొత్తం సీన్ మారిపోయింది. హైడ్రా ఎక్కడా ప్రైవేటు ఆస్తుల జోలికిరావడం లేదు కాబట్టి మెజార్టీ  ప్రజలు సమర్థిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడకు కృష్ణా నుంచి కాకుండా.. బుడమేరు నుంచి వచ్చిన  ముప్పు వల్ల సగం విజయవాడ ప్రజలు నష్టపోయారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు ..న్యాయంగా ప్రైవేటు స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి రాకండా ఉండాలంటే ఖచ్చితంగా చెరువుల్ని.. నాలాల్ని.. కాపాడుకోవాలని అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి మద్దతు లభిస్తోంది. మూసి విషయంలో నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది కాబట్టి.. అక్కడా వ్యతిరేకత రాదని.. వచ్చినా సపోర్టే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు
బాంబులు పెట్టి మరీ లేపేస్తున్నారు...
హైదరాబాద్‌లో హైడ్రా అక్రమ నిర్మాణదారుల గుండెళ్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిలో నిర్మించిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేస్తోంది. ఇప్పటికే హైడ్రా 100 ఎకరాల్లో నిర్మించిన వందలాది కట్టడాలనే కూల్చివేసింది. హైడ్రా దూకుడు ఇంకా కొనసాగుతోంది. హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎక్కడికి వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో ఆక్రమణదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు హైడ్రా చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తున్నారు. అన్ని జిల్లాల్లో హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లాలకు హైడ్రా రాక ముందే.. కొన్ని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వారం క్రితం మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ స్థలంలో కార్మిక సంఘం నేత నిర్మించిన రూ.10 కోట్ల విలువైన భవనాన్ని నేలమట్టం చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో చెరువులో నిర్మించిన భారీ భవనాన్ని అధికారులు ఏకంగా బాంబులు పెట్టి నేలమట్టం చేశారు.తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ పంచాయతీ పరిధిలోని కుతుబ్‌శాయిపేట చెరువులో భారీ భవనం నిర్మించారు. దీనిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు నిర్మాణం అక్రమమని నిర్ధారించారు. వెంటనే కూల్చివేతకు చర్యలు చేపట్టారు. నిర్మాణం పూర్తిగా చెరువులో ఉండడంతో పిల్లర్లకు బాంబులు అమర్చి కూల్చివేశారు. ఈ క్రమంలో ఇద్దరు గాయపడ్డారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మల్కాపూర్‌ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 12 ఏళ్ల క్రితమే ఈ భవనం నిర్మించాడు. నీటిలో అడుగు పెట్టకుండా భవనంలోకి చేరుకునేలా కొంతదూరం మెట్లు కూడా కట్టాడు. ఈ బహుళ అంతస్తుల భవనం యజమాని, కుటుంబ సభ్యులు వీకెండ్‌లో ఇక్కడికి వచ్చి సేదతీరేవారు. గ్రామస్తుల ఫిర్యాదు తర్వాత అధికారులు విచారణ చేసి అక్రమ నిర్మాణం అని గుర్తించారు. యజమానికి నోటీసులు ఇవ్వడమే కాకుండా కూల్చివేతకు గడువు ఇచ్చారు. అయినా యజమాని స్పందించకపోవడంతో గురువారం(సెప్టెంబర్‌ 26న) బాంబులతో కూల్చివేశారు. శిథిలాలు ఎగిరిపడి గాయపడిన ఇద్దరి ఆస్పత్రికి తరలించారు.ఇదిలా ఉంటే భవన కూల్చివేతపై యజమాని నరసింహులు స్పందించారు. భవన నిర్మాణానికి 12 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని తెలిపాడు. తాము పట్టా కింద అనుమతులు తీసుకుని 250 గజాల్లో భవనం నిర్మించామని పేర్కొన్నాడు. అక్రమంగా తమ భవనం కూల్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. భవనం నిర్మిస్తున్న సమయంలో ఎవరూ అడ్డుకోలేదని, ఇప్పుడు కూల్చడం ఏంటని ప్రశ్నించాడు.

Related Posts