YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంగారెడ్డి- మియాపూర్ రోడ్డుకు మోక్షం

సంగారెడ్డి- మియాపూర్ రోడ్డుకు మోక్షం

మెదక్, సెప్టెంబర్ 30,
హైదరాబాద్ శివారుల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతాల్లో పటాన్‌చెరు-సంగారెడ్డి కారిడార్‌ ఒకటి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌ జహీరాబాద్‌ వరకు విస్తరిస్తోంది. ఇదే నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర స్థాయిలో ఉంటుంది. మియాపూర్‌ నుంచి పటాన్‌ చెరు వరకు పెద్దపెద్దగా షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి రావడంతో పాటు ఐటీ కారిడార్‌కు లింక్‌ ఉండడంతో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ సమస్యకు ఫుల్‌ స్టాప్‌ పడనుంది.సంగారెడ్డి- మియాపూర్ రోడ్డుపై వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్ని కావు…రోజు, రోజుకు రద్దీ పెరిగిపోవడంతో గంటల తరపడి వేచి ఉండాల్సిన పరిస్థితి..ఒక రకంగా చెప్పాలంటే ఈ రోడ్డు పై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోయే పరిస్థితి. అందుకే అధికారులు ఈ ట్రాఫిక్ కష్టాలు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించారు..సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి.31 కి.మీ పొడవు ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం అవుతోంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. ఈ మార్గంలోనే ఉన్న కూకట్‌పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది.విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. మరోవైపు ఈ రహదారిలో వాహనాలకు క్రాసింగ్‌ రోడ్లతో ఇబ్బంది లేకుండా అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. బీహెచ్‌ఈఎల్‌తో పాటు పటాన్‌చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రా­రం, కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. ఈ రోడ్డును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉండగా. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్‌ఈఎల్‌ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఇలా ఈ రోడ్డు పూర్తి అయితే ముంబయి,షిర్డీ, షోలపూర్, గుల్బార్గా, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి.

Related Posts