నిజామాబాద్ నగరంలోని రోడ్లు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయి. అడుగడుగునా గుంతల మయంగా మారడంతో వాహనచోదకులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ద్విచక్ర వాహనదారులు నడుం నొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామంటూ పాలకులు సింగపూర్ వంటి దేశాల్లో తిరిగొచ్చినా.. నగరంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ పలువురు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నగరంలోని రోడ్లపై వాహనదారులు వెళ్ళాలంటే సర్కర్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి. అడుగడుగునా గుంతలు ఉండటంతో వాహనం ఏ మాత్రం అదుపు తప్పినా కిందపడి గాయాలు పాలుకావడమే. నగరంలోని కంఠేశ్వర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మొదలుకొని దుబ్బా వరకూ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఈ రోడ్డు గుండాల నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇక ఉదయం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏండ్ల క్రితం వేసిన రోడ్డు ప్రస్తుతం పూర్తిగా చెడిపోయింది. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్, బోధన్ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాలకు ఇదే బైపాస్ రోడ్డు కావడంతో లారీలు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్న పరిస్థితి. రోడ్లపై గుంతలు పెద్దగా ఏర్పడటంతో లారీలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కార్ల యజమానులు సైతం ఈ రోడ్లపై వెళ్ళాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు దాటే క్రమంలో కారు కిందిభాగం రోడ్డుకు తగిలి వాహనం పాడైపోతోందని పలువురు పేర్కొంటున్నారు.