YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాలుగు కార్పొరేషన్లుగా హైదరాబాద్

నాలుగు కార్పొరేషన్లుగా హైదరాబాద్

హైదరాబాద్, అక్టోబరు 5,
హైదరాబాద్ నగర జనాభా కోటిన్నరకు చేరుతోంది. ఇప్పటికే  ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నజనాభా మొత్తాన్ని పరగిణనలోకి తీసుకుంటే.. కోటిన్నర వరకూ ఉంటారు. ప్రభుత్వం ఇప్పుడు ఔటర్ మొత్తాన్ని గ్రేటర్ పరిదిలోకి తేవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాలుగా ఉన్న వాటిని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ మున్సిపాలిిటీలను కూడా కార్పొరేషన్లుగా మార్చే  ప్రణాళికలో ఉన్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి, హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా చేయాలని ప్రభుత్వం  మొదట ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే అది  పరిపాలనా పరంగా సరైన నిర్ణయం అనిపించుకోదన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే అదే సమయంలో ఇలా లెక్కకు మిక్కిలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఉంచడం కన్నా..  నాలుగు భాగాలు చేసి, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగరాలుగా నాలుగు కార్పొరేషన్లుగా మారిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చారు.  హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్‌గా చేయడమా? లేక నాలుగు యూనిట్లుగా నాలుగు కార్పొరేషన్లు చేయడమా? అన్న అంశంపై మేథోమథనం చేశారు. చివరికి నాలుగు కార్పొరేషన్లు బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత స్పెషలాఫీసర్ల పాలన తెచ్చారు రేవంత్ రెడ్డి. కానీ మున్సిపల్ కార్యవర్గాల పదవీ కాలం పూర్తి కాలేదు. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలాలు మరో ఏడాది  పైనే ఉన్నాయి. అందుకే ఆ పదవీ కాలంపూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించడం, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించాలని  మున్సిపల్ శాఖ అధికారులకు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి.  న్యాయపరమైన ఇబ్బందులేవీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. నగరం చుట్టుపక్కన .. ఔటర్ లోపల ఉన్న  మున్సిపాలిటీలు కార్పొరేషన్లను తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏర్పాటు చేశారు.  కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమానతలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.  కొన్ని డివిజన్లలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్నింటిలో 30 వేల మంది మాత్రమే ఉన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్‌ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. పేరుకే కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ స్థాయిలో కూడా పనులు చేపట్టలేకపోతున్నారు. గ్రేటర్ సిటీ మొత్తాన్ని నాలుగు కార్పొరేషన్లుగా చేస్తే  మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయించే అవకాశాలు ఉంటాయని  ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.   సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు  కూడా ఈ నిర్ణయం ఉయోగపడుతోందని అనుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో పెద్దగా బలం లేని కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయం రాజకీయంగా కూడా లాభం చేస్తుందని నమ్ముతున్నారు.

Related Posts