YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొండా రాజీనామా లేనట్టే,...

కొండా రాజీనామా లేనట్టే,...

వరంగల్, అక్టోబరు 14,
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఓ చిన్న సునామీనే సృష్టించారు. ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా రేగిన దుమారం కొండా సురేఖ కేటీఆర్‌పై చేసే ఆరోపణల క్రమంలో నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో అసలు వివాదం ప్రారంభమయింది. రాజకీయాలతో సంబంధం లేని సినీ కుటుంబాన్ని టార్గెట్ చేయడంపై ఇండస్ట్రీ ఘాటుగా స్పందించింది. అయితే తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. కానీ వివాదం మాత్రం కొనసాగుతోంది. కొండా సురేఖపై నాగార్జున రెండు పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంశానికి ప్రాధాన్యత లేదని కోర్టుకు చేరిందని ఇక రాజకీయం ఏమీ లేదని కాంగ్రెస్ తేల్చేసోంది. సురేఖతో రాజీనామా చేయించాలని హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు సూచనలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రియాంకా గాంధీ అక్కినేని అమలతో మాట్లాడారని కూడా చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొండా సురేఖను రాజీనామా చేయాలని అడిగినట్లుగా లేదని కనీసం మందలించినట్లుగా కానీ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. పైగా కొండా సురేఖ ఒంటరి కాదని ఆమెను అదే పనిగా టార్గెట్ చేస్తే మేమంతా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగానే హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేశారు. ఆ తర్వాత నాగార్జునపై కబ్జా కేసు కూడా నమోదు అయింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే కొండా సురేఖకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచిందని స్పష్టమవుతోదంని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా స్పందించలేదు. కానీ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఓ మీడియా సమావేశంలో  పరోక్షంగా స్పందించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కామెడీ చేశారు. పరువు నష్టం దాఖలు చేశారట.. పరువు నష్టం పిటిషన్ అని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రకారం చూస్తే కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి ఏ మాత్రం అసంతృప్తికి గురి కావడం జరగలేదని ఆమెకు పూర్తి స్థాయిలో సపోర్టుగా ఉన్నారని అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి రాజకీయ వివాదాలు వచ్చినప్పుడు సొంత పార్టీ నేతలకు నైతికంగా మద్దతుగా నిలకవకపోతే పార్టీ నేతల్లో స్థైర్యం తగ్గిపోతుంది. తమపై విపక్షాలు ఏదైనా  వివాదాలు సృష్టించినా ఇంతేనా అనుకుంటారు. అదే సమయంలో విపక్ష పార్టీలకు బలం వస్తుంది. అలాంటి వివాదాలను మరిన్ని తెరపైకి తెస్తారు. ఈ రాజకీయంపై రేవంత్ రెడ్డికి స్పష్టత ఉంది కాబట్టి బీఆర్ఎస్ ట్రాప్‌లో పడలేదని చెబుతున్నారు. నాగార్జున విషయంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సానుకూల అభిప్రాయం లేదు. బీఆర్ఎస్ నేతలతో  నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగరహస్యం.  ఆయన ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఆర్థిక వనరుల పంపిణీలో ఒక టూల్ అని గట్టిగా నమ్ముతారు. అందుకే కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదు. సురేఖకు నైతిక మద్దతు అందించారు. కొండా సురేఖకు అండగా ఉండటంలో రేవంత్ పర్ ఫెక్ట్ స్ట్రాటజీని పాటించారని కాంగ్రెస్ వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి.

Related Posts