YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్ లకే లాభాలు

ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్ లకే లాభాలు
ప‌లువురు బ‌డా బాబులు బ్యాంకుల‌కు వేల కోట్లలో మోసం చేయ‌డం, వ‌సూలు కాని రుణాలు కార‌ణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల‌న్నీ రూ.వేల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర నష్టం.. అక్షరాలా రూ.87,357కోట్లు. బ్యాంకుల త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 19 బ్యాంకులు నష్టాలను నమోదుచేశాయి. ఈ నష్టం విలువ రూ. 87,357కోట్లు. కేవలం ఇండియన్‌ బ్యాంక్‌, విజయ బ్యాంక్‌.. ఈ రెండు మాత్రమే లాభాలను ఆర్జించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్‌ బ్యాంక్‌ రూ. 1,258.99కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. విజయ బ్యాంక్‌ లాభం రూ. 727.02కోట్లుగా ఉంది. ఇక నష్టాలు చవిచూసిన బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తొలి స్థానంలో ఉంది. ఈ ఏడాది పీఎన్‌బీలో భారీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ నిందితుడిగా ఉన్న ఈ స్కాం విలువ రూ. 14వేల కోట్లకు పైనే. కుంభకోణం నేపథ్యంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ రూ. 12,282.82కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంక్‌ రూ. 1,324.8కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. పీఎన్‌బీ తర్వాత రూ. 8,237.93కోట్ల నికర నష్టంతో ఐడీబీఐ బ్యాంక్‌ రెండో స్థానంలో ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోనూ ఈ బ్యాంక్‌ రూ. 5,158.14కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఇక దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,547.45కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ. 10,484.1కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Related Posts