హైదరాబాద్ నగరంలో హరితహారంలో భాగంగా నాటే మొక్కల పరిరక్షణకు ముందుకు రావాల్సిందిగా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరితహారంలో 40లక్షల మొక్కలను నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యాన్ని నిర్థారించుకుందని తెలిపారు. దీనిలో భాగంగా ఐదు లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని ఖాళీ స్థలాలు, రహదారుల ఇరువైపులా నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ నాటనున్న మొక్కల రక్షణకు ట్రీ-గార్డ్లు అందజేసి, వాటి పరిరక్షణ బాధ్యతలు స్వీకరించాలని పలు కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలను కోరారు. ట్రీ-గార్డ్ల వెరైటీలు, వాటి వ్యయం, అవి దొరికేచోటు తదితర వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని సెంట్రల్ మీడియంల నిర్వహణకు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రైవేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నిర్థారించిన 40లక్షల మొక్కల్లో ఐదు లక్షలు జీహెచ్ఎంసీ ద్వారా నాటడంతో పాటు మిగిలిన 35లక్షల మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ నిర్వహించే నర్సరీలు, వాటిలో అందుబాటులో ఉన్న మొక్కలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రకటించడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం నగరంలో 526 ఖాళీ స్థలాలు ఉన్నాయని వాటిలో మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారంలో నాటిన మొక్కల్లో 90శాతంకు పైగా మనుగడ సాధించాయని తెలిపారు. నాటిన ప్రతి మొక్క పెరిగేలా ప్రత్యేక చర్ంలు చేపడుతున్నట్టు చెప్పారు.