నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. చిన్నారులను స్కూళ్లకు సన్నద్ధం చేసేందుకు వారం రోజులు నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ సన్నద్ధమైంది. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలో ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. 20వ తేదీ వరకు కార్యక్రమాలు రూపొందించగా.. 16న రంజాన్, 17న ఆదివారం సెలవు ఇవ్వనున్నారు.ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి నుంచి 16ఏళ్లలోపు పిల్లలందరూ బడిలోనే ఉండే విధంగా చూడడం, నమోదు నిలకడపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. 13వ తేదీపిల్లలతో బొమ్మలు, రంగు కాగితాలతో బ్యాడ్జీలు, పూలగుత్తులు, ఆహ్వాన పత్రికలు తయారు చేయించాలి. తర్వాత రోజు ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించే సామూహిక అక్షరభ్యాసానికి, సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలను శుభ్రపరచాలి. బడి మానేసిన పిల్లల వద్దకు వెళ్లి మళ్లీ వారిని పాఠశాలల్లో చేర్పించాలి. 14న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్ఎంసీ సభ్యులు, దాతలు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులను ఆహ్వానించి పాఠశాలల్లో సామూహిక అక్షరభ్యాసం నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలందరికీ రచ్చబండ గాని దేవాలయాల వద్ద నుంచి రంగుల బెలూన్లు చేతపట్టుకుని, మేళతాళాలతో బడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లాలి. చదువు ప్రాధాన్యతను తెలిపే పాటలు, గేయాలాపన చేయించాలి. నూతన పాఠ్యపుస్తకాలు అందజేయాలి. ఐదు, ఏడు, ఎనిమిది తరగతులు పూర్తి చేసిన వారిని సమీప ఉన్నత పాఠశాల్లో చేర్పించాలి. తరగతి నాయకుడు (సీపీఎల్) ఎంపిక చేయాలి. వ్యాయామ క్రీడా పరికరాలను ప్రదర్శించాలి. 15న అభిన గేయాలాపన, కథలు చెప్పడం, విద్యాంజలిలో పిల్లలు, గ్రామ పెద్దలు సేకరించి తీసుకొచ్చిన వాటిని ప్రదర్శించాలి. డిజటల్ తరగతులు ఉన్న చోట చిత్రకథలను ప్రదర్శించాలి. అవ్వ చెప్పిన కథలను వారితో చెప్పించాలి. సంప్రదాయ పాటలను పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు కథలు, కవితలు, చిత్రలేఖనం, పాటల పోటీలను నిర్వహించాలి.18న ‘నా ఊరు - నా చెట్టు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పిల్లలతో మొక్కలు నాటించాలి. ఆ మొక్కల పెంపకాన్ని వారికి దత్తత ఇవ్వాలి. పిల్లలు సేకరించిన విత్తనాలతో గింజల ప్రదర్శనగావించాలి. ప్రకృతి ప్రార్థన చేయించాలి. 19న వందనంపాఠశాలల్లో బోధన సామగ్రిని ప్రదర్శించాలి. మహిళా అధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖలను ఆహ్వానించి పిల్లలనుద్దేశించి మాట్లాడించాలి. పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, కూచిపూడి, భరతనాట్యం, సంప్రదాయ నృత్యాలను నిర్వహించాలి. పిల్లలకు చిన్న ఆటల పోటీలను నిర్వహించి, బహుమతులను ప్రదానం చేయాలి. 20న పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించి ప్రజాప్రతినిధులు, విద్యాభిమానులు, దాతల సమక్షంలో సత్కరించాలి. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. వక్తలను ఆహ్వానించి నైపుణ్యాభివృద్ధిపై ఉపన్యాసాలు చేయించాలి. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి సహపంక్తి భోజనాలు చేయాలి. బాలసభ నిర్వహించాలి. ఉన్నత పాఠశాలల్లో మాక్ పార్లమెంటు, అసెంబ్లీ జరపాలి. డిజటల్ తరగతి గదిలో బాలల చిత్రాలను ప్రదర్శించాలి.