మోదీ పరిపాలన నచ్చడం వల్లే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి విజయబావుటా ఎగురవేస్తూ వస్తుందని, దీనికి మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలే కారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ తెలిపారు. విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా గజ్వేల్లో నిర్వహించిన బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశాల్లో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ... నాలుగేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అనేక ప్రజాసంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అమలు చేసి పేదరిక నిర్మూళనకు ఎంతో కృషి చేశారన్నారు.యువతను పారిశ్రామిక వెత్తలుగా తీర్చి దిద్దేందుకు స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాతో పాటు ముద్రా యోజన పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ యువతకు, మహిళలకు మోదీ ప్రభుత్వం భారీ ఎత్తున రుణాలు ఇస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఇప్పటికే అనేక మంది యువత ఈ పథకాల ద్వారా లద్ధి పొందారన్నారు. మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేర్చడంతో పాటు, ప్రజాసమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా యువమోర్చా కార్యకర్తలు నడుంబిగించి ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని, యువతలో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.వ్యయసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు, ప్రకృతి బీభత్సం వల్ల పంటనష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి పసల్ బీమా యోజనను అమలు చేస్తుందని, వీటితో పాటు ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి సుకన్య యోజన, బేటీ బచావో-బేటీ పడావో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయపార్టీగా రూపొందిన పార్టీ .. బిజెపి అని, దేశంలోని 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉండటానికి ప్రధాన కారణం పేదలు పార్టీకి అండగా ఉండటమేనని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. దేశంలో ఏ మూలన ఎన్నికలు జరిగినా, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఎన్నికల్లో బిజెపి విజయదుందుభి మోగిస్తూ వస్తుందన్నారు.పేదరికం నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల కష్టాలను రూపమాపేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.వంటింట్లో కట్టెల పొయ్యితో వంటచేస్తూ తీవ్ర కష్టాలు పడే పేద మహిళలకు మోదీ ప్రభుత్వం ఉజ్వల పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తుందని, ఇప్పటికే దేశంలో 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు, ఒక్క తెలంగాణలోనే 20 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దళారుల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా 32 కోట్ల బ్యాంకుఖాతాలు తెరిపించారని, దీంతో నేరుగా ప్రజలకు, లబ్ధిదారులకు ప్రభుత్వం పథకాల ఫలితాలు అందుతున్నాయన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకంలో భాగంగా అనుకోని ప్రమాదం జరిగితే పేద కుటుంబాలను ఆదుకునేందుకు బీమా వర్తింప చేస్తున్నారని, సుకన్య యోజన పథకం ద్వారా నెలకు వేయి రూపయాలు చెల్లిస్తే... అమ్మాయి పెళ్లీడు వచ్చేనాటికి 6 లక్షల 50 వేల రూపాయలు చెల్లిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రధాని మోదీ అని డాక్టర్ లక్ష్మన్ కొనియాడారు.ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కోసం 12 వేల రూపాయాలు ఇస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదని, దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం 7 కోట్ల 50 లక్షల మురుగుదొడ్లు నిర్మించి ఇచ్చిందని, ఇది ముమ్మాటికీ పేదల ప్రభుత్వమని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి పంచాయతీకి మోదీ ప్రభుత్వం అపారమైన నిధులు పంపిస్తున్నదని, హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల కోసం తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులను ఇచ్చిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్రం మాత్రం సొమ్మొకరిది -సోకొకరిది అన్నట్లు, కేంద్రం నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ అవి తమవే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
మోదీ ప్రభుత్వం పంచాయతీలకు వెచ్చిస్తున్న నిధులు సద్వినియోగం కావాలంటే బిజెపి కార్యకర్తలు, నేతలు సర్పంచ్లుగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపికి యువతరం వెన్నెముక అని, భవిష్యత్ బిజెపి పునాదులు మరింత పటిష్టం కావాలంటే యువత బిజెపికి అండగా నిలిచి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నికల్లో బిజెపి గెలవడానికి మోదీ అభివృద్ధి ఎజెండానే ప్రధాన కారణమని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
దళితులకు ప్రాధాన్యత ఇస్తూ.. దళితుల అభ్యున్నతికి పాటు పడుతున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాత్రమేనని, అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి పంచ్తీర్థ్ పేరిట అంబేద్కర్ జన్మభూమి మౌ గ్రామాన్ని, చదివిన ప్రాంతమైన లండన్, దీక్షభూమి అయిన నాగ్పూర్తో పాటు ఢిల్లీ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అతన్ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్దని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేశామనడంలో ఎలాంటి వాస్తవం లేదని, గతంలో ఉన్నదానికంటే ఇంకా ఆ చట్టాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు. కొందరు గిట్టని వాళ్లు మాత్రమే బిజెపి పట్ల దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలూ ఒకే గూటి పక్షులేనని, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు మతోన్మాత మజ్లిస్ పార్టీ పెంచి పోషించిన పార్టీలని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినదాంతో స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ, ఇవాళ చంద్రబాబు చేస్తున్న స్వార్ధపూరిత రాజకీయాలు చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. సిద్ధాంతాలు పక్కన పెట్టి కర్ణాటక ఎన్నికల్లో బిజెపి గెలవకూడదని చంద్రబాబు, కేసీఆర్ కుట్రలు పన్నారన్నారు.నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని, తొలి దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ తుంగలో తొక్కిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని, కానీ, రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. ఎంతో ప్రతిభాపాటవాలు ఉన్న యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగుల కాలం వెల్లబుచ్చాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఛార్జ్షీట్ రూపొందించి ప్రజలకు వివిరించేందుకు బిజెపి వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళుతుందనిడాక్టర్ లక్ష్మన్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని డాక్టర్ లక్ష్మన్ దుయ్యబట్టారు. డిఎస్సీ కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారని, చదువులు చెప్పే ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేక పాఠశాలలు, కళాశాలలు నిర్వీర్యమయ్యాయని, ప్రమాణాలు కొరవడి ఉన్నత విద్య పూర్తిగా భ్రష్టు పట్టిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల పైగా ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డాక్టర్ లక్ష్మన్ డిమాండ్ చేశారు.