వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రపై స్పందించాడు తమిళ హీరో విశాల్. తెలుగు మూలాలున్న ఈ హీరో తనకు ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉందంటూ జగన్ పాదయాత్ర విషయంలో స్పందించాడు. జగన్ పాదయాత్ర అభినందనీయం అని అన్నాడు విశాల్. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటే మాటలు కాదు అని విశాల్ అన్నాడు. ఏసీ రూముల్లో కూర్చుంటే ఏమీ తెలియదని, ఇలా ప్రజల మధ్యలోకి వెళ్లినప్పుడే అవగాహన వస్తుందని విశాల్ అభిప్రాయపడ్డాడు. ఇలా ప్రజలను కలిసి వాళ్లతో మమేకం అవుతున్న జగన్ అభినందనీయుడు అని విశాల్ అన్నాడు. ఇలా లక్షల మందిని కలుస్తూ జగన్ వారి కష్టనష్టాలను తెలుసుకొంటున్నాడని అన్నాడు. తనకు జగన్ అంటే ఇష్టమే అని ఈ హీరో వ్యాఖ్యానించాడు. మీ అభిమాన నేత ఎవరు? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఇష్టమని, భగత్ సింగ్ అంటే ఇష్టమని విశాల్ వ్యాఖ్యానించాడు. ఈ హీరో తన తాజా సినిమా ‘అభిమన్యుడు’ పబ్లిసిటీ ప్రోగ్రామ్స్కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆ సందర్భంలో విశాల్ ఇలా స్పందించాడు. తన సినిమాల్లో కూడా రాజకీయాలపై డైలాగ్స్ పెట్టించుకొంటూ ఉంటాడు విశాల్. రాజకీయ నేతలు తమ పని తాము చేస్తే తమ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉండదని కూడా ఈ హీరో ఇటీవలే ఒక సినిమాలో డైలాగ్ వేశాడు.