హైదరాబాద్
హైటెక్ సిటీలో ని సీఐఐ గ్రిన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషం. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ…ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది.. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను ను తొలగించాం. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణ ను ఇప్పటి నుంచే ప్రారంభించాం. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నాం.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. వాటి మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్ ను చైనా కు ప్లస్ సిటీ గా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణ లో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతామని అన్నారు.
తెలంగాణ కు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవు తో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారి తో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని ,మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. భారతదేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తానని అన్నారు.