- ముంబైలోని ఓ హాస్పిటల్లో దారుణం..
ముంబై నాయర్ హాస్పిటల్లో శనివారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. ఓ బట్టల షాపులో సేల్స్మెన్గా పనిచేస్తున్న రాజేశ్ మరు అనే వ్యక్తి.. ఓ పేషంట్ కోసం హాస్పిటల్కు వచ్చాడు. పేషంట్ను స్కానింగ్ కోసం తీసుకువెళ్లాల్సి వచ్చింది. దీంతో పేషంట్తో పాటు రాజేశ్ స్కానింగ్ రూమ్కు వెళ్లాడు. రోగి దగ్గరున్న ఆక్సిజన్ సిలిండర్ను రాజేశ్ మోసుకుంటూ వచ్చాడు. స్కానింగ్ రూమ్లో ఎంఆర్ఐ మెషీన్కి ఉన్న అయస్కాంత శక్తి ఒక్కసారిగా సిలిండర్ను ఆకర్షించడంతో రాజేశ్ లోపలికి దూరిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజేశ్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా హాస్పిటల్ సిబ్బంది ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.