YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీ ప్లాన్.. గెలుపు కోసం పార్టీల కసరత్తులు

పంచాయితీ ప్లాన్.. గెలుపు కోసం పార్టీల కసరత్తులు

హైదరాబాద్, జనవరి 27, 
లోకల్ ఫైటింగ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. గ్రామంలో సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. రణమే మిగిలింది. అవును ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే గ్రామపంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో సాగుతున్నాయి. అన్ని ఎన్నికలు ఒకెత్తు.. స్థానిక ఎన్నికలు మరో ఎత్తు అన్నట్లుగా సాగుతుంటాయి. ఆ స్థాయిలో విలేజ్ లో పాలిటిక్స్ నడుస్తుంటాయి. కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అవుతుంటాయి. ఇంకొన్ని చోట్ల హోరాహోరీ పోరు నడుస్తుంటుంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా పార్టీల సానుభూతి పరుల చుట్టూ ఓట్ల మ్యాటర్ నడుస్తుంటుంది. చెప్పాలంటే ఊరు ఊరంతా ఓ పొలిటికల్ వైబ్రేషన్ నడుస్తుంటుంది.ఆ వైబ్రేషన్ షురూ అయ్యే టైమ్ రానే వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సమరానికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నగారా మోగబోతోంది. అటు మున్సిపల్ సమరానికి కూడా సమయం వచ్చేసింది. ఈనెల 26తో మున్సిపాలిటీల గడువు కూడా ముగియబోతోంది. దీంతో రెండూ ఒకేసారి జరుగుతాయన్న సమాచారంతో అటు గ్రామాలు, ఇటు పట్టణాల్లో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి.పంచాయతీ ఎన్నికల కోసమే తెలంగాణ క్యాబినెట్ ప్రత్యేకంగా భేటీ అవబోతోంది. ఆ లెక్కన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకే రంగం సిద్ధమవుతోందన్న చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం చేసిన కులగణన వివరాలు బీసీ డెడికేటెడ్ కమిషన్ కు చేరడంతో ఈనెలాఖరుకు సర్కారుకు రిపోర్టు ఇవ్వనుంది. ఆ ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ అవబోతోంది. పంచాయతీల పదవీకాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. అయితే బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్ లో ఉండడం వల్లే ఎన్నికలు లేటవుతూ వచ్చాయి. దీనిపై ఏదో ఒకటి డిసైడ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారుసో పంచాయతీ ఎన్నికల్లో హిట్ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటోంది. తాజాగా గ్రామసభలు నిర్వహిస్తోంది. జనవరి 26 నుంచి 4 కొత్త స్కీములు ఇచ్చేందుకు అంతా రెడీ చేసింది. రైతు భరోసా ఎకరానికి 6 వేలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో కాంగ్రెస్ భారీ ముందడుగు వేసింది. పంచాయతీ సహా లోకల్ బాడీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనప్పటికీ పార్టీ మద్దతు దారులే కీలకంగా ఉంటారు. సో అన్ని రకాల అస్త్రాలతో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి.నిజానికి పంచాయతీల్లో ఎప్పుడో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం హామీ నెరవేర్చాలనుకుంటోంది. అందుకోసమే కులగణన సర్వే చేపట్టింది. ఇది 98 శాతం పూర్తయిందంటున్నారు. మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటైంది. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కులగణన సర్వే ప్రాథమిక వివరాల ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ బీసీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరుతాయి. అంత కాకపోయినా 33 శాతం పెంచినా 50 శాతం లిమిట్ దాటుతుందిసుప్రీం తీర్పు ప్రకారం కోటా 50 శాతం దాటొద్దు. అయితే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేసి.. సైంటిఫిక్ పద్దతిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నందున కోర్టులు అడ్డుకోవనే ఆశతో ఉన్నారు. ఒకవేళ కోర్టుల్లో స్టే వస్తే పరిస్థితి మొదటికే వస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటేడ్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి.. తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆలోచన కూడా ఉంది. రాజ్యాంగం రూల్స్ ప్రకారం కోటా ఇవ్వలేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.పరిస్థితి ఎలా ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా హామీ నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో లెక్కలు పక్కాగా ఉన్నా ఎవరైనా బీసీగణన సరిగా జరగలేదని చెప్పి కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉంటుంది. సో పొలిటికల్ గా మ్యాటర్ ఎలా ఉన్నా పంచాయతీ ఎన్నికలైతే పెట్టాల్సిన పరిస్థితి. ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే వారం, పది రోజుల్లోనే కసరత్తును పూర్తి చేసి 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్, ఆ తర్వాత టెన్త్ పరీక్షలు ఉండనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది.తెలంగాణలో 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవలే కొత్తగా 12 మున్సిపాలిటీలను, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 129 మున్సిపాలిటీల టర్మ్ ఈనెల 26తో ముగిసింది. మరో 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ ఈ ఏడాది మే వరకు ఉంది. జీహెచ్ఎంసీ టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంది. సో ఏ రకంగా చూసినా GHMC నుంచి స్థానిక సమరం దాకా మ్యాటర్ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. 12 మున్సిపాలిటీల్లో కోహీర్, గుమ్మడిదల, గడ్డ పోతారం, ఇస్నాపూర్, చేవేళ్ల, మోయినాబాద్, మద్దూర్, దేవరకద్ర, కేసముద్రం, స్టేషన్ ఘన్ పూర్, అశ్వారావుపేట, ఏదులాపురం ఉన్నాయి. వీటిలో జనాభా, ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టేశారు. నెలరోజుల్లో ఈ ప్రాసెస్ జరుగుతుందంటున్నారు. మరో వైపు హైదరాబాద్ శివారులో ఉన్న 58 గ్రామ పంచాయతీలను సైతం శివారు మున్సిపాలిటీల్లో సర్కారు విలీనం చేసింది. ఇక్కడ కూడా వార్డుల విభజన సాగుతోంది. ఇవన్నీ త్వరలోనే కొలిక్కి రానుండగా, పంచాయతీల వెంటే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం ఉంది.గడువు ముగిసిన స్థానిక సంస్థలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా.. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి, అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం విడగొట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను స్టడీ చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ ఏర్పాటు చేస్తే ఈ మున్సిపాలిటీలకు గడువు లోపు ఎన్నికలపై న్యాయవివాదాలు తప్పుతాయంటున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే సవాలక్ష సవాళ్లు చుట్టుముడుతున్నాయి. ఇవి ఒక పట్టాన వీడే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయితే ఎన్నికలను మరింత ఆపే అవకాశాలు కూడా లేవు. అలా చేస్తే కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే గ్రాంట్లు, నిధులు ఆగిపోతాయి.సో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే నిధులు, పథకాలు, కార్యక్రమాలు, పనులు సాఫీగా జరుగుతాయన్న ఉద్దేశం జనంలో కూడా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థలు చాలా వరకు అవిశ్వాస తీర్మానాలతో హస్త వశమయ్యాయి. ఆఖరికి GHMC మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటోంది. అటు బీఆర్ఎస్ కూడా యాక్టివేట్ అవుతోంది. జనంలో ఉండేందుకు ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ నుంచి బయటకు రాకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోంది. ఓడిస్తే రెస్ట్ తీసుకుంటం అని గతంలో అసెంబ్లీ ప్రచారాల సమయంలో చెప్పినట్లుగానే ఫాంహౌజ్ కే పరిమితమయ్యారా అన్న చర్చ జనంలో జరుగుతోంది.మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. దీంతో స్థానిక ఎన్నికలను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంటోంది. అయితే విపక్షంలో ఉండడంతో మ్యాటర్ ఎంత వరకు కలిసి వస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు గ్రౌండ్ లో పరిస్థితులను తమవైపు తిప్పుకునేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది.దీంతో బీఆర్ఎస్ ఆశలన్నీ కేసీఆర్ పైనే ఉన్నాయి. ఆయన ఫాంహౌజ్ నుంచి బయటికొస్తే పరిస్థితిలో ఏమైనా మార్పు ఉండే అవకాశాలున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. అటు బీజేపీ గ్రౌండ్ లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని చెబుతున్నా ఇంకా ఫైనలైజ్ కావడం లేదు. నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా లేదా అన్నది కూడా ఎన్నికల్లో కీలకం కాబోతోంది.

Related Posts