పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన వాటితో సహా 129 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారులకు ఓ మారు శిక్షణ కూడా పూర్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం అవసరమైన సిబ్బందిని, కావాల్సిన పరికరాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమవడం గమనార్హం. అర్బన్ జిల్లా పరిధిలో ఏడు గ్రామీణ మండలాలుండగా 1238 వార్డులున్నాయి. కొత్తగా 26 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. మొత్తం గా 1లక్షా, 93వేల 733 ఓటర్లు ఉన్నారు. మూడు విడుతలుగా నిర్వహించబడే ఎన్నికలకు 1379 బ్యాలెట్బాక్స్లు అవరమవుతున్నట్లు అధికారులు నిర్థారిస్తున్నారు. 5 లక్షల బ్యాలెట్ పేపర్లు ఎన్నికలలో అవసరమేర్పడుతాయని అంచనా వేస్తున్నారు.పాత గ్రామంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన 26 పంచాయతీలలో మొదటి సారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వాహణకు అధికారులతో విడుతల వారిగా శిక్షణ శిభిరాలు ఏర్పాటు చేయడం, అవగాహన కల్పించడం శరవేగంగా సాగుతోంది. దీంతో ఆయా గ్రామాలలో సర్పంచీలకు, వార్డు సభ్యులకు పోటీ చేసే ఆశావాహులు ఎన్నికలలో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడం గమనార్హం.