
హైదరాబాద్, ఫిబ్రవరి 12,
రాహుల్ గాంధీని కలిసేందుకు రేవంత్ చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. తమ మధ్య గ్యాప్ లేదని రేవంత్ అంటున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణకూ అనుమతి రాకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి
మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేత, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరంగల్ టూర్ పెట్టుకున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన రైల్లో చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పర్యటనకు రాహుల్ బయలుదేరక ముందే క్యాన్సిల్ అయింది. అసలు ఖరారు అయినట్లుగా ఎవరికీ సమాచారం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియదు. అందరికీ క్యాన్సిల్ అయిన సమాచారమే తెలిసింది. రాహుల్ వస్తూంటే.. తమ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్ర సీఎంకు సమాచారం ఇవ్వరా ? అన్న చర్చ జరుగుతోంది. రాహుల్ కు.. రేవంత్ కు మధ్య గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారానికి ఇది మరింత బలం చేకూరుస్తోంది. రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు .. నేనే ఆయన అపాయింట్ మెంట్ అడగలేదు అని ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పుకున్నారు. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే సమస్య ప్రారంభమయిందని రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ ఓ స్పష్టత వస్తుంది. చాలా కాలంగా రాహుల్ గాంధీ .. రేవంత్ రెడ్డిని కలవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఏ పార్టీకి అయినా ముఖ్యమంత్రులు కీలకం. అందుకే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు..త కార్యక్రమాలకు రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా జాబితాలో చేరుస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ ఆయనకు ప్రత్యేకంగా సమయం ఇవ్వడం లేదు. తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. తాను సమర్పించిన జాబితా విషయంలో అభ్యంతరాలు ఉన్నందునే పర్మిషన్ ఇవ్వడం లేదనుకున్న రేవంత్ రెడ్డి తన జాబితా ఏమీ లేదని అంతా హైకమాండ్ కష్టమేనని వారు ఎవరితో ప్రమాణం చేయించమంటే వారితో చేయిస్తానని ఢిల్లీల ప్రకటించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి పార్టీపై పట్టు తగ్గించేందుకు హైకమాండ్ ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించబోతున్నట్లుగా హైకమాండ్ లీకులు ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించారు. ఎస్సీ,ఎస్టీ, రెడ్డి, ముస్లిం సామాజికవర్గాల నేతలకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే పార్టీలోని ఇతర పదవుల భర్తీపైనా ప్రకటన చేయనున్నారు. కానీ మంత్రి వర్గ విస్తరణకు మాత్రం హైమాండ్ ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఢిల్లీ వెళ్తున్నారు..కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తురు కానీ రాహుల్ ను మాత్రం రేవంత్ కలవలేకపోతున్నారు. దీంతో ఆయనకు రాహుల్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని పూడ్చడానికి అయినా ఓ సారి రాహుల్ తో భేటీ కావాలని రేవంత్ అనుకుంటున్నారు. కానీ అవకాశం మాత్రం రావడం లేదు. మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. హైకమాండ్ ఇదే పద్దతిలో ఉంది. రేవంత్ రెడ్డికి ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించే క్రమంలోనే ఇదంతా చేస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ ప్రచారాన్ని తగ్గించుకోవడానికి రేవంత్ అర్జంట్ గా రాహుల్ తో సమావేశం కావాల్సి ఉంది. మరి సాధ్యమవుతుందా ?