
హైదరాబాద్, మార్చి 10
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు.. దీంతో సారొస్తారొస్తారు.. అని గులాబీ దళం మాంచి జోష్ మీదున్నది. ఫామ్హౌస్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనే సంకేతాలొచ్చాయి. ఏప్రిల్ 17న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో కీలక సూచనలు చేశారు కేసీఆర్. ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం ద్వారా మళ్లీ ఉద్యమ పంథాలో విజృంభించాలని పథక రచన చేశారా? అందులో భాగంగానే పోరుగడ్డ ఓరుగల్లును పొలిటికల్ పొలికేకకు వేదికగా నిర్ణయించారా? ఇదంతా ఒక వైపు. అంతకన్నా ముందు అసెంబ్లీ సమావేశాలకు కేసీర్ హాజరు కాబోతున్నారనే చర్చ మరో ఎత్తు… అయితే.. బుధవారం అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు.. సర్కార్పై సంధించాల్సిన ప్రశ్నలు..అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.. అయితే.. డైరెక్షన్ మాత్రమే కాదు డైరెక్ట్గా సభకు వస్తారంటున్నారు బీఆర్ఎస్ నేతలు.జటీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ టోన్తో పొలిటికల్ సీన్ మారింది. బీఆర్ఎస్కు ప్రస్తుతం సభలో ఉన్న బలం-బలగం ప్రకారం ఒక సీటు గెలవచ్చు. రెండో అభ్యర్థిని నిలబెడితే ఎలా వుంటుందనే చర్చను ఫామ్హౌస్ మీటింగ్తో తెరపైకి తెచ్చారు. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహామా? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చే ఎత్తుగడా? అనే డిస్కషన్స్ నడిచాయి.ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ రెండు సీట్లకు పోటీ చేస్తుందా?..అని పొలిటికల్ డొమైన్లో చర్చకు తావు తీసిన కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్కుమార్ అభ్యర్థితత్వాన్ని ఖరారు చేయడం ద్వారా తన మార్క్ చాటుకున్నారనేది నడుస్తోన్న టాక్. మరి ఇంతకీ గులాబీ దళం చెప్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావడం ఖాయమేనా? అయితే సభలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,కులగణన, బీసీ రిజర్వేషన్.. ఎస్పీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, రాష్ట్ర అప్పులు.. ఇలా కీలక అంశాలపై సభలో గళమెత్తడం సహా.. ఔర్ ఏక్ దక్కా అనే రేంజ్లో మళ్లీ ఉద్యమ పంథాలో విజృంభిస్తారా? అనే చర్చయితే జోరందుకుంది. ఇదంతా బీఆర్ఎస్ఎల్పీ భేటీలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.