కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు. ఈ విషయంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా స్పష్టంగా బయటపడింది. మోదీతో కేసీఆర్కు రహస్య ఒప్పందం ఉందంటూ అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్న ఉత్తమ్కుమార్ రెడ్డి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో భావసారూప్యం లేని పార్టీలతో ఎలా జట్టు కట్టారో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్య బద్ధంగా అధిక సీట్లు వచ్చిన బిజెపికి అధికారం రాకుండా.. తమ తమ సిద్ధాంతాలు, విధానాలను పక్కన పెట్టి, భావసారూప్యం లేని పార్టీలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ అధికార దాహాన్ని బయటపెట్టుకున్నాయి. మోదీ పాలనలోనే ముస్లింలు, దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి దిశగా ముందడుగు వేస్తున్నారు. వారసత్వ, కుటుంబ పాలనతో, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, స్కాంలతో ప్రజాధనాన్ని లూటీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బిజెపి అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్ ఓ ప్రకటనలో విమర్శించారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు ఎలాగైన బిజెపి అధికారంలోకి రావొద్దన్న దుష్ట ఆలోచనతో, మొన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న పార్టీలతో చేతులు కలపడం వెనుక ఉన్న మతలబు ఏంటో ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పాలి. ముంజేతి కంకణానికి అద్ధం ఎందుకున్నట్లు.. కర్ణాటక ఎన్నికల్లో ఎవరు ఎవరితో దోస్తీ కట్టారో.. ఎవరికి ఎవరితో రహస్య ఒప్పందాలున్నాయో తేటతెల్లం అయింది. ప్రజామోదం, ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని కర్ణాటకలో ప్రజావ్యతిరేక పాలనకు పాల్పడుతున్న జేడీఎస్కు కాంగ్రెస్ మద్ధతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పాలని ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు.
మోదీ విధానాలు నచ్చడం వల్లే దేశవ్యాప్తంగా ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని, మోదీ ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల వల్లే ఇవాళ దేశంలోని 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటిముఖం పంపించి, బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు