
న్యూఢిల్లీ, మార్చి 28,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు బుధవారం దిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ను చైనా, కెనడా, మెక్సికోలతో పోల్చి చూడబోమని యూఎస్ స్పష్టం చేసింది. ఈ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, భారత్తో కేవలం సుంకాల సమస్య మాత్రమే ఉందని పేర్కొంది. ఈ సమస్యను ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. ఈ చర్చల కోసం వాషింగ్టన్వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో భారత్కు చేరుకున్నారు. శుక్రవారం నాటికి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఒప్పందం రెండు దేశాలకు సంతృప్తికరంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్లో వాషింగ్టన్కు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సుంకాలు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, మిత్ర దేశాలు, శత్రు దేశాలతో సంబంధం లేకుండా సుంకాలు విధిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తోందని ఆరోపిస్తూ, ఏప్రిల్(April) నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ఇటీవల అమెరికా పర్యటనలో యూఎస్ వాణిజ్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. సుంకాల తగ్గింపు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించారుప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటనలో ట్రంప్తో దౌత్య, వాణిజ్య, రక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్, సుంకాల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని, భారత్ అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధిస్తోందని, ఇకపై తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.