
హైదరాబాద్, మార్చి 29,
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ అంతు పట్టడం లేదంటున్నారు. మంత్రిత్వ శాఖల భర్తీకి ఏఐసీసీ పచ్చజెండా ఊపినట్లు ప్రచారమైతే జరుగుతోంది. అయితే విస్తరణ ఎప్పుడు జరిగినా తమ శాఖలను మార్చాలని సిట్టింగ్ మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం ఆసక్తి కరంగా మారింది. మరోవైపు పనితీరు ఆధారంగా కొందరు మంత్రుల పోర్టుపోలియోలు మారుస్తారంటున్నారు. తెలంగాణ కేబినెట్లో భారీగా ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయంట.. 18 మంది సభ్యులు ఉండాల్సిన తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఆరు పదవుల కోసం చాలా మంది నేతలే రేసులో కనిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.గత కొంత కాలంగా కేబినెట్ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు జరుపుతూనే ఉంది. కొత్తగా వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షీ నటరాజన్ కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ.. పరిస్థితులపై ఆరా తీస్తున్నారంట. దీంతో.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్త్లు ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందంటున్నారు.ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖలను కూడా మార్చే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు చెప్తున్నారు. పనితీరు ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ మంత్రుల శాఖల మార్పులు చేర్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఇచ్చిన శాఖలపై సీనియర్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం చాలాకాలంగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఉత్తమ్ దగ్గరున్న పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖలు వేరొకరికి ఇచ్చి.. వేరే కీలక శాఖలను ఆయనకు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయంట.అటు మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నారంట. కోమటిరెడ్డి తన సీనియార్టీతో పనులు పరుగులు పెట్టించాలని చూస్తున్నా ఆయన నిర్వహిస్తున్న ఆర్ అండ్ బి శాఖలో అధికారులు సహకరించడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారంట. అందుకే ఆయన కూడా తన శాఖను మార్చమని కోరుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.మరోవైపు తెలంగాణలో ఎక్సైజ్ శాఖ పనితీరుపైనా ప్రభుత్వ, పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారంటున్నారు.. ఆ శాఖను చూస్తున్న జూపల్లి కృష్ణారావు దగ్గరున్న ఎక్సైజ్ శాఖను మరొకరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ఇప్పుడు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖలను కొత్త మంత్రులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి కేబినెట్లోకి నలుగురినే తీసుకోవచ్చంటున్నాయి ఏఐసీసీ వర్గాలు.ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి దగ్గరున్న హోంమంత్రి పదవి సుదర్శన్రెడ్డికి దక్కొచ్చంటూ ఢిల్లీ నుంచి లీక్లు వస్తున్నాయి. పార్టీలో సీనియర్ కావడం, వివాదరహితుడిగాఉన్న పేరు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో హైకమాండ్ ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రి వర్గ విస్తరణపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో?… శాఖల మార్పులు చేర్పులు ఎలా జరుగుతాయో కాని.. ఈ విస్తరణ తర్వాత కూడా రెండు కేబినెట్ పోస్టులను ఖాళీగా ఉంచే ఛాన్స్ ఉందంటున్నారు.