
రంగారెడ్డి
తమ పరిధికి మించిన వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తదితర సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు జరిపారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు ఆర్ఎంపి పిఎంపి క్లినిక్ లను తనిఖీ చేసి సీజ్ చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న కీర్తి పాలీ క్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక భాగంలో ఉన్న దవాఖాన, మనిశ్విని క్లినిక్ లను సందర్శించి డాక్టర్ వెంకటేశ్వరరావు వాటిని సిస్ చేశారు. కీర్తి క్లినిక్ పై డాక్టర్ రాజు అని పేరు రాసుకోవడం జరిగిందని ఇది తప్పని డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలు క్లినిక్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాథమిక వైద్యం చేయకుండా ఇష్టం వచ్చినట్లు పరిధి దాటి మరి కొందరు వైద్యం చేస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పరిధికి మించి వైద్యం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. ఆర్ఎంపీలు పీఎంపీలు డాక్టర్ అనే పదాన్ని అసలు వాడుకోవద్దని హెచ్చరించారు. ప్రధమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండాలని, ఎవరు ప్రజా వైద్యశాల వైద్యశాల ఆసుపత్రి అని బోర్డులు పెట్టుకోరాదని హెచ్చరించారు. ఆర్ఎంపీలతో క్వాలిఫై డాక్టర్స్ సైతం ఇక్కడ విలవిలలాడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వారం రోజులపాటు నిరంతరంగా వైద్య ఆరోగ్యశాఖ దాడులు నిర్వహిస్తుందని హెచ్చరించారు. అనుమతి లేని ఆసుపత్రుల్లో బెడ్లు ఉండకూడదని సూచించారు. ఈరోజునుండి షాద్ నగర్ ప్రాంతంలో ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆర్ఎంపీల నియంత్రణ జరుగుతుందని సూచించారు. అనారోగ్యంతో బాధపడేవారు కేవలం క్వాలిఫై డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని అనవసరంగా ఆర్ఎంపీలు పీఎంపీ ల వద్దకు వచ్చి విలువైన వైద్యం చేసుకోకూడదని దీనివల్ల అనేక దుష్పరిణామాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..