YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్

తెలంగాణలో  ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్

హైదరాబాద్,  ఏప్రిల్ 9, 
తెలంగాణలో రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అమలు అయిన ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయనున్నారు. 10వ తేదీ నుంచి 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త విధానం తీసుకొస్తారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజలకు సత్వర సేవలు అందించేందు లేటెస్ట్ టెక్నాలజీ విరివిగా వాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇప్పటికే ఆ వ్యవస్థపై అనేక ఆరోపణలు ఉన్నందున వాటిని తొలగించి ప్రజలకు పారదర్శక సేవలు అందేందుకు ఆ విధానం తీసుకొస్తోంది. ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఈ మేరకు ఈ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు సబ్‌-రిజిస్ట్రేష‌న్ కార్యాలయాల్లో చాలా సమయం వృథా అవుతూ వస్తోంది. ముందుగా దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వనం స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకువస్తోంది. దీని వల్ల గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే ప‌నిలేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌్లోనే ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ు ఉన్నాయి. ముందుగా కేవలం 22 ఆఫీసుల్లో మాత్రమే ఈ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి అమ‌లులోకి రానున్నట్టు ప్రకటించారు.
స్లాట్‌బుకింగ్ అమల్లోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు
హైద‌రాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట
మేడ్చ‌ల్ జిల్లా కుత్బుల్లాపూర్‌, వల్లభ్ నగర్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్, స‌రూర్ న‌గ‌ర్‌, చంపాపేట్ పెద్ద‌ప‌ల్లి జిల్లా రామగుండం
ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O),
మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని తెలిపారు.
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం వస్తుంటాయి. దీని వల్లే ఎక్కువ సమయం వృథా అవుతుంది. దీన్ని నివారించేందుకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. దీని వల్ల ఏ సమయంలో స్లాట్ తీసుకుంటే ఆ టైంకు వచ్చే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించి ఈ విధానం అమల్లోకి తెస్తున్నారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు మంత్రి పొంగులేటి. స్లాట్ బుక్ చేసుకోనివారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ల‌ను అనుమతిస్తార‌ు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తార‌ని తెలిపారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామ‌న్నారు మంత్రి. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిని నియమించామన్నారు. దీనివ‌ల‌న కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను రీ ఆర్గ‌నైజేష‌న్ చేస్తున్నామ‌ని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా అధిక ర‌ద్దీ, త‌క్కువ ర‌ద్దీ ఉన్న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల ప‌రిధిని అనుసంధానం చేసి ప‌నిభారాన్ని ఈక్వల్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట – సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్ సైట్‌లో ఒక మాడ్యూల్‌ని ప్రవేశపెట్టామ‌ని మొద‌ట‌గా సేల్ డీడ్ ద‌స్తావేజుల కోసమే ఈ సౌక‌ర్యం ఉంటుంద‌ని ఇది కూడా ఐచ్చిక‌మేన‌ని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపైన అమ్మినవాళ్ళు, కొన్నవాళ్లు, సాక్షులు మరియు సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా/భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీని వలన ప్రజల సమయం వృథా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ-సంతకం ప్రవేశపెడుతున్నామ‌ని ఈనెల చివ‌రిలోగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింద‌నే ఫిర్యాదులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయ‌ని, దీన్ని నివారించడానికి చ‌ట్టాన్ని స‌వ‌రించ‌బోతున్నామ‌ని తెలిపారు. డబుల్ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్ప‌టికే చ‌ట్టాల‌ను స‌వ‌రించుకున్నాయ‌ని, అదే విధంగా తెలంగాణ‌లో కూడా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్స్ 22కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీసుకురావడం జరుగుతుంద‌ని తెలిపారు.

Related Posts