YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కౌలు రైతు దిగాలు

కౌలు రైతు దిగాలు
‘రైతుబంధు’తో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇక పండగే..అంటున్న పాలకులు కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద రైతులు మాయమై చిన్న, సన్నకారు రైతులే వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. భూస్వాముల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరు లక్షల్లో ఉన్నా కనీస ప్రభుత్వ పరమైన గుర్తింపు లేకపోవడంతో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కాగితాలకే పరిమితమవుతున్నాయి.  ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో కౌలు రైతులకు రూ.4 వేలు దక్కలేదు.  ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే అధికంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కౌలు రైతుల దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
కౌలుదారుడికి న్యాయం జరగకపోతే వ్యవసాయరంగానికి, ఆహార భద్రతకు తీరని నష్టమేనన్నది  నిపుణుల సూచన. రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ సాయం అందక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటల్లో నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ భూములు ఉన్న వారికే కాకుండా కౌలు రైతులకు కూడా బ్యాంకు రుణాలు అందించాలని అప్పటి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. వారికి ప్రతి ఏడాది గడువుతో రుణ అర్హత పత్రాలను అందించింది. ఏడాది ముగిసిన తర్వాత మళ్లీ తిరిగి మీ సేవలో ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే తమకు రుణ అర్హత కార్డులు ఇవ్వకుండా భూ యజమానులు అడ్డుపడుతున్నారని వారు ఆందోళనకు గురవుతున్నారు. కార్డులు మంజూరు చేసి బ్యాంకు రుణమైనా అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
జిల్లాలోని కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. భూ యజమాని వద్ద తెల్ల కాగితంపై రాసుకొని కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో బ్యాంకు అధికారులు వారికి రుణాలు ఇవ్వడం లేదు. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. సుమారు లక్ష హెక్టార్లలో కౌలు రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో వరి, పత్తి సాగు చేశారు. కొందరు భూ యజమానులకు ఒప్పందం ప్రకారం ముందే కౌలు చెల్లించాలి. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో పలువురు కౌలు రైతులు భూయజమానుల మాటల మీద భరోసాతోనే సాగు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం సాగు చేసుకొని భూమి యజమానికి డబ్బులు చెల్లించాలి. కౌలుకు భూమి ఇచ్చినట్లు రాతపూర్వకంగా ఒప్పందానికి భూమి యజమాని ముందుకు రావడం లేదు. నిబంధనల ప్రకారం బాండ్‌ కాగితంపై కౌలుకు ఇచ్చినట్లు రాయించుకోవాలి. రెవెన్యూ అధికారులు గుర్తింపు కార్డులు అందించడం లేదు. బ్యాంకర్లు గుర్తింపు కార్డులు ఉంటేనే రుణాలు అందిస్తామంటున్నారు. కార్డులు లేక రుణాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కౌలు రైతు చట్టం భూయజమానుల అనుమతులు లేకుండానే కౌలు రైతుకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. తమ సొంత భూముల ద్వారా కౌలు రైతులు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది భూ యజమానులు నిరాకరిస్తున్నారు. దీంతో వారికి  రుణాలు అందడం లేదు. ఈ క్రమంలో ఇప్పటి ప్రభుత్వం 2015లో భూ యజమాని అనుమతి లేకుండా రుణ అర్హత కార్డులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అసలే భూ యజమానులు అనుమతి లేక రుణాలు పొందలేని వారికి ప్రభుత్వ కొత్త జీవో కష్టాలు తెచ్చిపెట్టింది. యజమానులు తమ భూములను తాకట్టు పెట్టి పంట రుణాలు తెచ్చుకోవడంత కౌలు రైతులకు రెండోసారి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. చట్టం ప్రకారం భూమి అభివృద్ధి కింద రెండోసారి రుణం అందించే వెసులుబాటు ఉంది. అయితే బ్యాంకర్లు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
అధీకృత సాగుదారుల చట్టం మేరకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసిన రైతుకు ఎలాంటి హామీ లేకుండా రూ.50 వేలు రుణం ఇవ్వాల్సి ఉన్నప్పటికి బ్యాంకులు మాత్రం ముందుకు రావడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారుల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. సాగుచేసే వారికి అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్తింపు అర్హత కార్డులు ఉన్న వారికి కూడా బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్డు ఉండి అప్పు కోసం బ్యాంకుకు వెళ్తే పట్టా రైతు నుంచి పాస్‌ పుస్తకం తీసుకురావాలని నిబంధన పెడుతున్నారు. కౌలు రైతుకు యజమాని పట్టా పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో ఏం చేయలేని కౌలురైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులుతెచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల అర్జీలను పరిశీలించి రుణ కార్డులను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.
జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో కౌలు రైతులే అధికంగా ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే వర్షాలు లేకపోవడం, పంటలకు తెగుళ్లు సోకడం, ఇతరత్రా కారణాల వల్ల దిగుబడులు తగ్గి పంటలో నష్టం వచ్చినా భూ యజమానికి మాత్రం ముందుగా ఒప్పందం చేసుకున్న కౌలు చెల్లించాల్సిందే. దీంతో కౌలు రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరుసటి పంట కాలానికి భూ యజమానులు ఇప్పటి వరకు చేసిన వారికి కాకుండా మళ్లీ కొత్త వారికి తమ భూములను సాగుకు ఇస్తున్నారు. దీంతో తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలనే బెంగతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Related Posts