
హైదరాబాద్, ఏప్రిల్ 17,
రాజకీయాల్లో ఓ సక్సెస్ ఫార్ములా ఉంటుంది. ఓ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్ములా, ఫార్మాట్లలో ఎవరైనా ప్రయత్నిస్తే.. విజయం సాధిస్తే.. అదే దారిని మరికొందరు ఎంచుకుంటారు. ఏపీలో నారా లోకేష్ అనుసరించిన ఫార్ములా, ఫార్మాట్ను ఇప్పుడు తెలంగాణలో కవిత ఎంచుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ అని ఓ పుస్తకం పట్టుకుని ప్రచారం చేశారు. అందులో చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు రాశానని అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటానని చెప్పేవారు. చర్యలు తీసుకోరేమో అన్న డౌట్ వద్దని చంద్రబాబు మంచి వారే కానీ తాను మాత్రం మూర్ఖుడినని చెప్పేవారు. ఈ మాటలు క్యాడర్ మనసుల్లోకి వెళ్లిపోయాయి. ఆయన ఇమేజ్ పెరిగింది. విజయం కూడా లభించింది. ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇలాంటి రాజకీయమే చేస్తున్నారు. కవిత తమ పార్టీ రంగు అయిన పింక్ బుక్ పేరుతో రాజకీయం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ మంచోడే కానీ.. తాను కాస్త రౌడీ టైప్ అని స్వయంగా చెప్పుకున్నారు. తెలంగాణ రాజకీయాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. కవిత తమ పార్టీ నేతలకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం చెప్పడానికి… కాంగ్రెస్ నేతలను బెదిరించడానికి లోకేష్ చూపిన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కవిత ప్రకటన వైరల్ గా మారింది. బీఆర్ఎస్ సభకు వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు వస్తున్నాయని పార్టీ నేతలు ఆమెకు చెప్పడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో లోకేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని కొంత మంది గుర్తు చేసుకుంటున్నారు. లోకేష్ తరహా రాజకీయం చేస్తున్న కవిత.. పాదయాత్ర ఆలోచన కూడా చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ నేతసలు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. వచ్చే ఏడాది ఆయన పాదయాత్ర ఉంటుంది. అందుకే కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకూ అంటే తనకు బాధ్యత ఇచ్చిన జిల్లా వరకూ పాదయాత్ర చేసే ఆలోచన చేయవచ్చని అంచనా వేస్తున్నారు. లోకేష్ ఫార్ములా మొత్తానికి అందర్నీ ఆకట్టుకుంటోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నేతలకు హెచ్చరించారు. తాము పింక్ బుక్ లో అన్ని పేర్లు నమోదు చేసుకుంటున్నామని, అధికారుల నుంచి రాజకీయ నేతల పేర్ల వరకూ నమోదు చేసుకుంటున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ కార్యకర్తలను, నేతలను వేధించిన వారిని వదిలపెట్టే ప్రసక్తి లేదని కవిత హెచ్చరించారు. రజతోత్సవ సభకు... వరంగల్ లో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని తెలిపారు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్న కవిత బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదని ఎంఎల్సీ కవిత వ్యాఖ్యానించారు.