
విశాఖపట్టణం, ఏప్రిల్ 19,
ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 16, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, బిజెపి నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు ఉన్నారు. అయితే వీరు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడం పై ఓ రిపోర్టు విడుదలైంది. ఎంపీల పనితీరుపై పిఆర్ఎస్ ఇండియా సమాచారం సేకరించింది. 18వ లోక్సభ బడ్జెట్ సమావేశాలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రిపోర్టు నివేదికను బయటపెట్టింది పిఆర్ఎస్ ఇండియా. ఎంపీల హాజరు విషయానికి వస్తే.. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అమలాపురం ఎంపీ జిఎం హరీష్ 99% పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ 97%, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు 93% తో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. హాజరులో ముందున్నది వీరే పార్లమెంటుకు 90 శాతానికి పైగా హాజరైన వారిలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో కలిసేట్టి అప్పలనాయుడు, జిఎం హరీష్, శ్రీ భరత్, దగ్గుమల్ల ప్రసాదరావు, బస్తీపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. అయితే వీరంతా తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికైన వారే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి 54% హాజరుతో చివరి స్థానంలో ఉన్నారు.లోక్సభలో ప్రశ్నలు వేయడంలో సైతం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఏకంగా 89 ప్రశ్నలు వేసి రికార్డు సృష్టించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 84 ప్రశ్నలతో రెండవ స్థానంలో నిలిచారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ 82 ప్రశ్నలు వేసి మూడో స్థానంలో నిలిచారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అత్యల్పంగా 22 ప్రశ్నలు అడిగారు. లోక్సభలో విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు 22 చర్చల్లో పాల్గొని టాప్ గా నిలిచారు. వైయస్సార్సీపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి 19 చర్చలతో రెండవ స్థానంలో నిలిచారు. జనసేన కు చెందిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి 18 చర్చలతో మూడో స్థానంలో ఉన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి మాత్రం కేవలం ఒకే చర్చలో మాత్రమే పాల్గొన్నారు. అయితే ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఏపీ సమస్యలపై వారు ప్రశ్నించడం లేదన్న విమర్శ ఉంది. అయితే పార్లమెంటుకు ఎన్నికైన వారు మాత్రం హాజరు వేసుకోవడం, ప్రశ్నలు వేయడం, చర్చల్లో పాల్గొనడం లో ముందు వరుసలో నిలవడం విశేషం.