
హైదరాబాద్, ఏప్రిల్ 19,
తెలంగాణ నేల ఇప్పుడు బంగారు పంట పండిస్తోంది. ఒకప్పుడు కష్టాల కడలిలో ఓలలాడిన రైతు నేడు తన భూమి విలువ చూసి సంబరపడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకప్పుడు లక్షల్లో పలికిన ఎకరం నేడు కోట్లలో మాట్లాడుతోంది. హైదరాబాద్ మహానగరంలో కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల సంగతి చెప్పనక్కర్లేదు.. అక్కడ ఎకరం భూమి ఏకంగా 90 కోట్ల రూపాయలకు పైగా పలుకుతోంది. ఇక నగర శివారుల్లో సైతం రూ.50 కోట్లకు తక్కువ లేదు.ఇంతటి విలువైన భూముల్లో చాలా వరకు రైతులు వ్యవసాయం చేస్తూ ఉండటం నిజంగా విశేషం. కళ్ళెదుటే కోట్ల రూపాయలు కనబడుతున్నా.. తమ భూమిని అమ్ముకోవడానికి చాలా మంది రైతులు వెనుకాడుతున్నారు. తమ పంటకు సరైన మద్దతు ధర రాకపోయినా, పెట్టుబడి కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా, కనీస అవసరాలు తీరని దుస్థితి ఎదురైనా.. తమ భూమిని మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తరతరాలుగా వస్తున్న ఆ భూమి వారి గుండెల్లో ఒక జ్ఞాపకం, ఒక అనుబంధం. డబ్బుకు ఆ బంధాన్ని తెంచుకోవడానికి వారు ఎంత మాత్రం సిద్ధంగా లేరుహైదరాబాద్ నగరానికి సమీపంలోని హయత్ నగర్ దగ్గర కుంట్లూరు ప్రాంతంలో అయితే ఈ దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారి పక్కనే ఉన్న భూములకు కోట్లలో ధర పలుకుతున్నా, అక్కడి రైతులు మాత్రం తమ పొలాలను అమ్ముకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వారసత్వంగా వచ్చిన ఆ భూమిని వదులుకోలేక.. వ్యవసాయంపై ఉన్న మక్కువతో నేటికీ వరి పంటను సాగు చేస్తూ ఆ నేలను పచ్చదనంతో నింపుతున్నారు.కొంతమంది రైతులు తమ పొలాలను అమ్ముకున్నారు. అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి. ఒకవైపు సిమెంటు జంగిల్, మరోవైపు పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.. డబ్బు కళ్ల ముందు కనబడుతున్నా.. తమ భూమిని అమ్ముకోకుండా వ్యవసాయాన్ని నమ్ముకున్న ఆ రైతుల గురించి తెలుసుకున్న వారంతా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.వీళ్ళే నిజమైన రైతన్నలు. భూమి మీద ప్రేమంటే ఇదే’ అంటూ వారిని కొనియాడుతున్నారు. నిజంగా.. ఆ రైతులు తీసుకున్న నిర్ణయం వెలకట్టలేనిది. డబ్బుతో కొనలేని అనుబంధాన్ని వారు నిలుపుకున్నారు. భూమిపై బంగారం పండకపోయినా.. నోటికి చేరే ముద్ద కోసం చేసే వ్యవసాయమే బంగారు పంటగా భావిస్తున్న ఆ రైతన్నలకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.