YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇక మెట్రో మోత...

ఇక మెట్రో మోత...

హైదరాబాద్, ఏప్రిల్ 19, 
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం టికెట్ రేట్ల పెంపుకోసం ప్రయత్నించినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఆ తర్వాత మెల్ల మెల్లగా రాయితీలు తొలగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి రోట్ల పెంపుపై చర్చ నడుస్తోంది. నష్టాల్లో నడుస్తున్న మెట్రోకు చార్జీల పెంపుతో ఊరట లభిస్తుందని అంటున్నారు. అదే జరిగితే హైదరాబాద్ లో మెట్రో ప్రయాణం మరింత భారం అవుతుంది.ఇటీవల బెంగళూరు మెట్రోలో 44శాతం మేర చార్జీలు పెంచారు. దీంతో హైదరాబాద్ మెట్రో చార్జీల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రూ.10 కనిష్ట టికెట్ ధర. గరిష్టంగా రూ.60 గా ఉంది. అయితే స్టూడెంట్ పాస్ లు, హాలిడే సేవర్ కార్డ్ లతో ఇన్నాళ్లు మెట్రో ప్రయాణికులు కాస్త ఊరట పొందారు. కానీ ఇటీవల వాటిని కూడా యాజమాన్యం రద్దు చేసింది. దీంతో రాయితీలు పూర్తిగా ఎత్తేసినట్టయింది. అంటే ఒకరకంగా చార్జీల పెంపుకి రంగం సిద్ధమవుతున్నట్టే లెక్క.కరోనా టైమ్ లో హైదరాబాద్ మెట్రో భారీగా నష్టాలు చవిచూసింది. ఆ తర్వాత కూడా మెట్రో నిర్వహణ మేనేజ్ మెంట్ కి పెద్దగా గిట్టుబాటయ్యేలా కనపడ్డంలేదు. అడ్వర్టైజ్ మెంట్ లు, రైల్వే స్టేషన్లలో వ్యాపార కార్యకలాపాలు.. ఇలా చార్జీలు కాకుండా ఇతరత్రా ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం కనపడ్డంలేదు. దీంతో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని యాజమాన్యం చాన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. అయితే చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే అనుమానంతో ప్రభుత్వం కాస్త ఆలోచిస్తోంది. దీంతో మెట్రో చార్జీల పెంపు కొన్నాళ్లుగా వాయిదా పడుతోంది.గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టి సంస్థ తన మొత్తం నష్టాలను రూ. 6,500 కోట్లుగా ప్రకటించింది. ఇందులో మెట్రో భాగం కూడా ఉంది. ఈ భారాన్నుంచి బయటపడాలంటే మిగతా వ్యాపారాల్లో లాభాలు రావడంతోపాటు, మెట్రోలో కూడా నష్టాలు తగ్గాలి. అంటే కచ్చితంగా చార్జీలు పెంచడం ఒక్కటే మార్గం అని ఎల్ అండ్ టి సంస్థ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కరోనా కాలంలో మెట్రో తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తోంది. గతంలో ఫేర్ అండ్ ఫిక్సేషన్ కమిటీ కూడా మెట్రో చార్జీల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.కనిష్ట చార్జీ రూ.10 అంటే కచ్చితంగా అది ప్రయాణికులకు వెసులుబాటుగానే ఉంటుంది. కానీ ఈ టికెట్ పై మెట్రోకి పెద్దగా వచ్చేదేమీ లేదు. ఇక గరిష్ట టికెట్ విషయంలో కూడా ఇతరత్రా ప్రైవేటు ప్రయాణ సాధనాలకంటే మెట్రో ప్రయాణం చాలా చౌక. వాస్తవానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో ప్రయాణికులనుంచి వసూలు చేసే చార్జీలకంటే ఇతరత్రా ఆదాయ మార్గాలపైనే యాజమాన్యాలు ఎక్కువగా ఆధారపడుతుంటాయి. కానీ హైదరాబాద్ మెట్రో విషయంలో అవి కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని అంటున్నారు. మరోవైపు మెట్రో ఎక్స్ టెన్షన్ కి కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ దశలో చార్జీల పెంపు అనివార్యం అని తేలింది. మరి దీనిపై ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Related Posts