
హైదరాబాద్, ఏప్రిల్ 28,
మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ ను ఆపేందుకు ప్రాణాలు కాపాడుకునేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి చర్చలకు పిలవాలని.. కోరుకుంటూ లేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా రూపేష్ పేరుతో లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో వందల కొద్దీ బలగాలు 'సీజ్ ఎరాడికేషన్ మిలటరీ ఆపరేషన్'ను ను నిర్వహిస్తున్నాయని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. శాంతియుత చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని.. మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుందని కేంద్ర కమిటీ తరపున ఓ సందేశాన్ని మీడియా ద్వారా పంపించారు. కేంద్ర కమిటీ కూడా శాంతి చర్చలకు సంబంధించి లేఖలు జారీ చేసిందని కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని మావోయిస్టు నేత ఆరోపిస్తున్నారు. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం అణచివేత , హింసను ఉపయోగించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో పెద్ద ఆపరేషన్ ప్రారంభమైంది. కీలక మావోయిస్టు హిడ్మాను బలగాలు చుట్టుముట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను అటునుంచి చత్తీస్గఢ్ పోలీస్ బలగాలు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుటల్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకోనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంద ని చెబుతున్న సమయంలో శాంతి చర్చలకు మావోయిస్టులు పిలుస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతదేశంలో నక్సలిజం ను అంతం చేయడానికి మార్చి 31, 2026 నాటికి గడువు పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. బస్తర్ డివిజన్లో 2024 జనవరి నుండి 310 మంది మావోయిస్టులు హతమయ్యారు, 2021 నుండి మొత్తం 385 మంది హతమయ్యారు. ప్రస్తుతం బస్తర్లో కేవలం 400 మంది సాయుధ క్యాడర్లు మాత్రమే మిగిలి ఉన్నారని బస్తర్ ఐజీ పి. సుందర్రాజ్ ప్రకటించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ కూడా బలహీనపడింది, కేవలం 12-14 మంది కమాండర్లు మాత్రమే చురుకుగా ఉన్నారు. 2024లో చత్తీస్గఢ్లో 287 మావోయిస్టులు హతమయ్యారు, 1000 మంది అరెస్టయ్యారు, 837 మంది లొంగిపోయారు. 2025 ఏప్రిల్ 19న, సుక్మా మరియు బీజాపూర్ జిల్లాల్లో 33 మావోయిస్టులు లొంగిపోయారు, దీంతో సుక్మాలోని బడేసెట్టి గ్రామం నక్సల్-రహితంగా ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, విద్య, విద్యుత్, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా స్థానికుల మద్దతు సంపాదించే ప్రయత్నం జరుగుతోంది. నక్సల్-రహిత గ్రామాలకు రూ.1 కోటి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు. షా చత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ, నిధులు, ఆర్థిక మూలాలను అడ్డుకోవడం, ఇంటెలిజెన్స్ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ కారణంగా మావోయిస్టుల శాంతి చర్చలను కేంద్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.