
అమరావతి
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర అంశాలను అయన అధికారులతో కలిసి పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి వస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయి. బుధవారం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కిమీ ట్రంక్ రోడ్లు,లే ఔట్ రోడ్లు 1500 కి,మీ మేర నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే 41 వేల కోట్లకు పనులు ప్రారంభం అయ్యాయి. 2019 కు ముందు 5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించాం. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడింది. మళ్ళీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ లు క్లోజ్ చేయలేదు. రివర్స్ టెండరింగ్,జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చింది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. 43 వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అమరావతి రాజధాని పునఃప్రారంభం ప్రధాని చేస్తారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. నిన్న రైతులతో సీఎం రెండుగంటలపాటు మాట్లాడారు. 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారు. అమరావతిపై పార్లమెంట్ లో చట్టం చేయాలని రైతులు అడిగారు. చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారని అన్నారు.