కడప ఉక్కు పరిశ్రమ కోసం తమ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు టీడీపీ ఎంపీలంతా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం అమరావతిలో టీడీపీ ఎంపీలు, మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడంపై కేంద్ర సర్కారుని నిలదీయాలని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన, చర్చించాల్సిన అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఆ విషయాన్ని ఏంపీలకు ఆయన చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయ్ విజయ్ తదితరులతో మాట్లాడనున్నట్లు ఆయన వివరించారు. బిజెపి, వైకాపాల కుట్ర రాజకీయాలపై ప్రజలను చైతన్యపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టిడిపి ఎంపిలకు సూచించారు. పీఎంవోలో విజయసాయిరెడ్డి తిష్ట వేయడంపై గతంలో ఫొటోలు వచ్చాయని, ఇప్పుడు ఢిల్లీలో బుగ్గన, ఆకులతో కలిసివెళ్లడంపై వీడియోలు వచ్చాయన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో.. బీజేపీకి అడగకుండానే వైసీపీ బేషరతుగా మద్దతిచ్చిందని చంద్రబాబు విమర్శించారు.అన్ని జిల్లాల్లోనూ వారానికి ఒక కార్యక్రమం చేపట్టి ప్రజలను చైతన్యపరచాలన్నారు. బిజెపి నమ్మకద్రోహంపై ప్రజలను చైతన్యపరచాలన్నారు.విభజన చట్టం అంశాలు, హామీలు నెరవేర్చకపోవడంపై ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలని ఆయన అన్నారు.