తెలంగాణపై కొముర వెళ్లి మల్లన్న దేవుడి ఆశీర్వాదం కనపడుతున్నదని, మల్లన్న దేవుడి పేరు మీద మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని, కాళేశ్వర దేవుడి పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే.. ఈ అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డంకోవాలన్న నెపంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం నాడు అయన సిద్ధిపేట జిల్లా కొముర వెళ్లి మల్లన్న దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో జరిగిన సభ సమావేశంలో మాట్లాడారు. ఆర్అండ్ఆర్ ముసుగులో ప్రాజెక్టు పనులకు అడ్డంకులు సృష్టించొద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ లో స్టేను నిలుపు దల చేస్తూ హై కోర్ట్ ఛీఫ్ జస్టిస్ ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెసోళ్లు ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారని, ఇప్పటి దాకా 200 పైగా కేసులు వేశారని, 70, 80 వరకూ హైకోర్టులో కేసులు వేశారంటూ, అలాగే మద్రాసు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారని, కానీ మల్లన్న దేవాలయ పాలక మండలి కొలువు తీరడం, మల్లన్న దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందని., ఆ మల్లన్న దేవుడి దయతో ఇక్కడి ప్రాంతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. మల్లన్న దేవాలయంలో మల్లన్న కల్యాణోత్సవానికి వచ్చి పట్టు వస్త్రాలు తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రూ.18 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు వివరించారు. కొముర వెళ్లి దేవాలయాన్ని టెంపుల్ సిటీ- టూరిజంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.