YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మరో సారి పవన్ కళ్యాణ్ ట్వీట్ల దాడి..!!

మరో సారి పవన్ కళ్యాణ్ ట్వీట్ల దాడి..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని భూములపై స్పందించిన పవన్.. భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే సరిపడా భూముల్ని సమీకరించినందున భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని సూచించిన ఆయన, అలా చేస్తే తాను పోరాటం చేస్తానని పవన్ హెచ్చరించారు. ఈ అంశంపై అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నట్లు తెలిపారు. సోంపేట థర్మల్ విద్యుత్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ వైఖరిని సైతం పవన్ తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ‘ఏపీ సీనియర్ రాజకీయ నాయకులు తమ దోపిడీలను ఆపాలి.. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఇంకా శాశ్వతంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తూ కాలుష్యకారక పరిశ్రమలను ఏర్పాటుచేసి దాన్ని ఓ డంపింగ్ యార్డుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని’ దుమ్మెత్తిపోశారు. 
అలాగే శ్రీవారి ఆభరణాలపై రమణదీక్షితుల ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు. ‘గులాబీ రంగు వజ్రంతోపాటు విలువైన ఆభరణాలు మాయమైనట్టు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు’ అంటూ విమర్శించారు. ‘భక్తులు విసిరిన నాణేలుకు గులాబీ రంగు వజ్రం ముక్కలైందని అంటున్నారు.. అందులో ఉన్న నిజమెంతో భక్తులుగా తెలుసుకోవాలనుకుంటున్నాం.. అలాంటప్పుడు ఆ శకలాలను ఎందుకు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించడం లేదు.. మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత కూడా ఉంది కదా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూన్ 23న పవన్ కళ్యాణ్ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పవన్‌ పోరాట యాత్ర ఈ నెల 26 నుంచి విశాఖ జిల్లాలో పునః ప్రారంభం కానుంది. రంజాన్‌ సందర్భంగా తన భద్రతా సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం పవన్‌ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనను మూడు నెలలుగా బాధిస్తున్న కంటి సమస్యకు ఈ విరామ కాలంలో చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్‌ అనుకున్నారు. అయితే శస్త్ర చికిత్స కొసం కొంతకాలం ఆగాలని వైద్యులు సూచించడంతో.. ఆ తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. 

 

Related Posts