YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కర్నూలు జిల్లాల్లో టిక్కెట్ల లొల్లి

కర్నూలు జిల్లాల్లో టిక్కెట్ల లొల్లి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీలో కొత్త చర్చను...అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్‌ దాదాపుగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికారపార్టీలో మొదలైంది. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశం లేదని అధికారపార్టీ నేతలే పేర్కొంటున్నారు.దీంతో ఇప్పటికే కర్నూలు సీటు దాదాపుగా నిర్ణయం కావడంతో మరో సీటు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏది కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ముందుచూపుతో ఎస్వీ మోహన్‌ రెడ్డి పావులు కదిపి తన బెర్త్‌ రిజర్వ్‌ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల, ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరిపై వేటు పడుతుందోనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు వెదజల్లడంతో పాటు గెలిచేందుకు సెంటిమెంటు ఆటను కూడా అధికార తెలుగుదేశం పార్టీ బాగా రక్తికట్టించింది. ఇప్పుడు అదే సెంటిమెంటు..అభ్యర్థులకు సంకటంగా మారుతోంది.నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిన కొన్ని నెలల తర్వాత హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన విషయం విదితమే. ఇందుకోసం గత చరిత్రను సైతం ప్రజలకు గుర్తుచేశారు. గతంలో భూమా శేఖర్‌రెడ్డి మరణిస్తేనే నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని... భూమా నాగిరెడ్డి మరణించడంతో శేఖర్‌రెడ్డి కుమారుడికి ఇవ్వడమే సరైందనే వాదన తీసుకొచ్చారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తల్లిదండ్రులు లేని అమ్మాయి అఖిలప్రియ, తండ్రిలేని అబ్బాయి  బ్రహ్మానందరెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ సెంటిమెంటును పండించే ప్రయత్నం చేసింది.అయితే, ఇప్పుడు అదే సెంటిమెంటును అధికారపార్టీ పాటిస్తుందా? లేదా అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అదే సెంటిమెంటును పాటించి నంద్యాల సీటును బ్రహ్మానందరెడ్డికి, ఆళ్లగడ్డను అఖిలప్రియకు ఇస్తారా అన్న చర్చ అధికారపార్టీలోనే జరుగుతోంది. మరోవైపు.. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నంద్యాల తమకివ్వాలంటూ ఇప్పటికే ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ సెంటిమెంటును పాటించి బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియకు ఇస్తే ఎస్పీవై రెడ్డితో పాటు ఫరూఖ్‌ వర్గం కూడా సహకరించే పరిస్థితి లేదని సమాచారం. ఈ మొత్తం చర్చ జరిగి ఎక్కడ తనకు ఎసరు వస్తుందనే ముందుచూపుతోనే ఎస్వీ మోహన్‌ రెడ్డి ముందుగానే తన సీటు రిజర్వ్‌ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సెంటిమెంటుతో ఒకే కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు సీట్లు  కేటాయించేది కష్టమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సెంటిమెంటుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదనేది వారి అభిప్రాయం. కేవలం ఉప ఎన్నికల కోసమే సెంటిమెంటు ఫ్యాక్టర్‌ను వాడుకున్నారు మినహా... దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశమేలేదని అంటున్నారు. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి తనయుడు, వైసిపి యువ నాయకులు, నంద్యాల సమన్వయకర్త శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి చేపడుతున్న పనులకు నియోజకవర్గంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. వైసిపి ఆధ్వర్యంలో ప్రజలకు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి నేనున్నంటూ భరోసా ఇస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఎక్కడ చూసిన పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు జయహో రవిచంద్ర అంటూ వార్డుల్లో, గ్రామాల్లో, వీధుల్లో, వాడల్లో ఆయనకు బ్రహ్మారథం పట్టి పూలతో స్వాగతం పలుకుతున్నారు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తనపార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నేనున్నాంటూ వారి వెన్నుతట్టి వారి సాదకబాధలు వింటూ వెన్నంటి నడుస్తున్నారు. ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రవిచంద్రకు జేజేలు పలుకుతున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీలో ముసలం ఏర్పడి, నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వాటాల లావాదేవీల పంపకాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో అధికార పార్టీనాయకులు, కార్యకర్తలు వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ చూసినా వైసిపి నినాదాలు భారీగా వినిపిస్తున్నాయి. యువనేత రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యూహంతో రాబోయే 2019 ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరేసే అవకాశాలు కనిపిస్తుందని అధికార పార్టీలో గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం. టిడిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రవిచంద్ర చేస్తున్న పనులను చూసి గురువారం దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన భూమా చెంచిరెడ్డి 200 మంది అనుచరులతో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి (నాని), ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. భూమా కుటుంబ సభ్యులే వైసిపిలో చేరడంతో అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడం లేదు. టిడిపి నాయకుల గుండెల్లో గుబులు ఏర్పడి, ఇంకొంత మంది అధికార పార్టీని వీడి వైసిపిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రజల చర్చించుకుంటున్నారు. పంచాయతీ, కౌన్సిలర్‌, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చాలా మంది నాయకులు, కార్యకర్తలు వైసిపి వైపు మొగ్గుచూపుతున్నట్లు విమర్శలు వస్తున్నారు. ఏదిఏమైన శిల్పా కుటుంబం చేస్తున్న సేవలు నంద్యాల నియోజకవర్గ ప్రజలు నాలుగేళ్ల నుంచి గమనిస్తూ ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ప్రజలకు చేదోడు, వాదోడుగా ఉన్నారని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు వైసిపి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజకీయ సమీకరణలతో రాబోయే ఎన్నికల్లో నంద్యాలలో వైసిపి జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతి త్వరలో నంద్యాల పట్టణంలో కూడా అధికార పార్టీ నుంచి వైసిపిలోకి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైసిపి నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Posts