YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                     శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం
                         బాలకాండ - "మందర మకరందం".. వ్యాఖ్యానారంభం
    ఏదో ఒక ప్రయోజనం కోరకుండా, ఎంత తెలివి తక్కువ వాడైనా, ఏ పనీ మొదలు పెట్టడని అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కవి అనేవాడు కూడా అలానే కదా! ఇదే నిజమైతే కావ్య రచన వలన కలిగే ప్రయోజనం ఏదైనా వుందా? కీర్తికొరకో, ధనం కొరకో, వ్యవహార జ్ఞానం తెలుసుకునేందుకో, అశుభ పరిహారానికో, కావ్యాలు రాయాలంటాడు కావ్యప్రకాశకారుడు. ఓ గద్యాన్నో, పద్యాన్నో, గద్య-పద్య మిశ్రమాన్నో (చంపువు) కావ్యం అనవచ్చు. కావ్యం ప్రియురాలి పలుకుల్లా తియ్యగా వుండాలేకాని, రాజాజ్ఞలా శాసించే విధంగా వుండకూడదు. అప్రియమైంది కూడా కాకూడదు.
    ఇలాంటి కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది, వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం. శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో,  స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, భవిష్యత్ తరాలవారు అంధకారంలో పడిపోయి దురాచార పరులై పోయేవారేమో! అట్టి మహోపకారం లోకానికి చేసిన వాల్మీకి మహర్షిని ఎంత పొగిడినా తక్కువే.
    బ్రహ్మర్షి వాల్మీకి రచించిన రామాయణం సంస్కృత భాషలో వున్నందువల్ల చాలామందికి దురవగాహమై పోయింది. చాలామంది తెలుగులో అనువదించి నప్పటీకీ అవి కేవలం కథాంశం తెలియ చెప్పడానికే పరిమితమై పోయాయి. తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మ విషయాలను అనువాదకులు వదిలిపెట్టారు. వాసుదాస స్వామి శ్రీరామ భక్త కోటిలో చేరి, దాసోభావంతో పరమ భక్తో-ప్రపత్తో మోక్షోపాయానికి మార్గమని భావించాడు. త్రికరణ శుద్ధిగా తన ఇష్టదేవతా గ్రంథాన్ని, కైంకర్య రూపంలో, ఆ దేవతకే అంకితమివ్వాలన్న నెపంతో-ఆయన నామస్మరణ మననం ఎల్ల వేళలా లభించేలా వుండాలన్న వుద్దేశంతో, అనన్యుడై, ఈ కృతి రచించాలని అనుకున్నాడు. వాసుదాసుగారు దీర్ఘ రోగి-దుర్బలుడు-అశక్తుడు (అని ఆయనే భావించేవారు). జీవచ్ఛవంలా బ్రతుకు కొనసాగిస్తున్నానంటూ, శ్రీరామానుగ్రహం వల్ల-భక్త కోటుల ఆశీర్వాద బలం వల్ల-పూర్వ జన్మ సుకృతం వల్ల, ఎలానో గ్రంథ రచన పూర్తి కావించ గలిగానని చెప్పుకుంటారాయన.
    ఇది వెలువడిన కొత్తలో, ఒకనాడు, చెన్నైలో, హైకోర్టు ముందునుండి నడుచు కుంటూ పోతున్నాడు గ్రంథకర్త. ఆ రోజున న్యాపతి సుబ్బారావు పంతులు గారు ఆయన్ను కలిశాడు. "మూల రామాయణానికి సరైన రీతిలో అనువాదం చేసావు. నువ్వు రాసిన రామాయణానికి సరైన వ్యాఖ్యానం వుంటేనే పాఠకులకు ఉపయోగంగా వుంటుంది. ఆ వ్యాఖ్య రాయడానికి నువ్వే సమర్థుడవు" అని సూచించారు. కొన్నాళ్లకు కలిసిన వావిలాల శివావుధానులవారూ అదే మాటన్నారు. వారి సూచన గ్రంథకర్త హృదయంలో నాటుకు పోయింది. ఫలితంగా వెలువడిందే ఈ "మందరం" అనే ఈ వ్యాఖ్యానం (అదే ఇప్పుడు "మందర మకరందం" గా వెలువడింది).
    గ్రంథకర్త ప్రపితామహుడైన వావిలికొలను రత్నాజీ పంతులు "రత్నాజీయము" అనే పేరుతో రామాయణానికి వ్యాఖ్యానం రచించారట. అయితే అది లభ్యం కాలేదు. తన వ్యాఖ్యానానికి, సర్వ భారం శ్రీసీతారామచంద్రుల పైన వేసి, రచనకు పూనుకున్నానని, శ్రీరామచంద్రుడి దయవల్ల పూర్తి చేయగలిగానని అంటారు వాసుదాసుగారు.
    బాల కాండ: శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అని,  రెండో కాండలో ఆయనే "హేతువు" అని, మూడో కాండలో ఆయనే "మోక్ష దాత" అని, నాలుగో కాండలో ఆయనే "గుణ సంపత్తి" అని, అయిదులో "సర్వసంహార కర్త" అని, ఆరవ కాండలో  "వేదాంత వేద్యుడు" అని, ఏడో కాండలో ఆయన బ్రహ్మకు "హేతువు" అని, ఇలా, శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువే "పరతత్వం" అని తెలుస్తుంది.
    జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేక ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు.

గ్రంథ పీఠిక…గ్రంథకర్త ఇష్టదేవతా నమస్కారం
    శ్రీ సీతాదేవి వల్లభుడు, చేతన-అచేతనాలకు ఆధారం, పోషణ కర్త కాగలిగే వాడు, సాధువులపాలిటి కల్పవృక్ష మనదగినవాడు, మదించిన శత్రువులను సంహరించే స్వభావం కలవాడు, భక్త సమూహానికి మోక్షమిచ్చేవాడు, హస్త కమలంలో కోదండం ధరించే వాడు, ఏక శిల పేరుతో వ్యవహరించే ఒంటిమిట్టలో వుండేవాడు, వంచనలేని నడవడి కలవాడైన శ్రీరామచంద్ర పర బ్రహ్మం, నా నమస్కారాలను ప్రేమతో అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను.
    “శ్రీం. ఓం. రాం. రామాయనమ" అనే బీజాక్షర యుక్తమైన రామ షడక్షర మంత్రాన్ని గ్రంథకర్త తన 22వ ఏట కంప సముద్ర వాస్తవ్యుడైన శ్రీమాన్ చేట్లూరి నరసింహాచార్య దేశికులవలన ఉపదేశం పొంది, అప్పటినుంచి సబీజంగా జపం చేస్తున్నారు. శ్రీరామ మంత్రోపదేశం కాకుండా శ్రీమద్రామాయణం పారాయణం చేయరాదని పూర్వుల నియమం. ఇది ఆంధ్ర గ్రంథం కదా-దీన్ని పారాయణం చేయ వచ్చా, అన్న సందేహం కలగొచ్చు. దక్షిణాది వారు వేదాంతార్థాలను తమ భాషలో రాసుకుని, దానికి ద్రావిడామ్నాయం అని పేరు పెట్టుకుని, పఠిస్తున్నారు. సంస్కృతం కంటె ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఆంధ్రులకు మాతృభాష ఆంధ్రం. మాతా మహి భాష సంస్కృతం. అది తులసిలా పూజ్యమే కాని, పూలను శిరస్సుమీద ధరించవచ్చు కాని తులసిని కాదుకదా! వెంట్రుకలపై తులసిని ధరించే బ్రాహ్మణుడు శూద్రుడితో సమానమైన వాడని పూర్వీకుల అభిప్రాయం.
    మంత్రంగా నేర్చుకొనేటప్పుడు, మొదలు ప్రణవం, తర్వాత శ్రీ బీజం వుండాలికదా! ఈ పద్దతిని తారుమారు చేయాల్సిన అవసరం వుందా అని అనుమానం రావచ్చు. రహస్య మంత్రాలు ఉపదేశించేటప్పుడు సక్రమంగా చెప్పొచ్చు కాని, రాసేటప్పుడు చెప్పడం మాంత్రికాచారం కాదు. గరుడ మంత్రం చెప్పేటప్పుడు "పక్షి" బదులుగా "క్షిప" అని చెప్పబడింది. వేద మంత్రాలకు "ఓం" కారంలా, ఆంధ్ర కృతులలో "శ్రీ" కారమే ప్రధానంగా గ్రహించడం ఆంధ్ర కవి సంప్రదాయమైంది.
    శ్రీమద్రామాయణం "సీతాయా శ్చరితం మహత్"- అంటే, సీతా దేవి మహాచరిత్రేనని వాల్మీకి చెప్పారు. మామూలు రామాయణం అనలేదాయన-శ్రీమద్రామాయణం అని పేరుపెట్టారు. జనక రాజు కూతురు ఎవరిదవుతుందో-వాని తేజం అపరిమితమనినదా రామాయణం చెప్తోంది. రాముడు శ్రీరాముడవడానికి ఇదే కారణం కదా. శ్రీరామచంద్రమూర్తి కూడా ఇది అంగీకరించాడు. తండ్రి కంటే తల్లి పదింతలు ఎక్కువ పూజ్యురాలు. సీతాదేవి అనుగ్రహం లభిస్తే రామానుగ్రహం కలిగినట్లే. అందుకే "శ్రీ"  శబ్దం మొదలు వాడబడింది. మంత్రోచ్ఛారణలో ప్రణవం మొదలు రావాలి. ఆరక్షరాల రామ మంత్రంలో ప్రణవం లెక్కకురాదు. ఎందుకంటే, "రా" మనేదే ప్రణవార్ధవాన్ని బోధిస్తుంది. అందువల్లే ప్రణవోచ్ఛారణానికి అధికారం లేనివారు కూడా శ్రీరామ మంత్రానికి అధికారులవుతున్నారు.
    "నారాయణ" మంత్రంలో ఎన్ని అక్షరాలు వున్నవన్న చర్చ, కొందరు విమర్శకులకు కలిగింది పూర్వం. చివరకు "ఎనిమిది" అక్షరాలని నిర్ధారించారు. ఆ న్యాయాన్ననుసరించే "రామ" మంత్రం "ఏడు" అక్షరాల మంత్రమని గ్రహించడమే సరియైన పద్దతి.
    ప్రణవం లేకుండా ఉచ్ఛరిస్తే ఫల లోపం ఏ మాత్రం కలగదు. మంత్ర లోపమూ లేదు. నారాయణ పరాయణుడైన పుండరీకుడు "నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించి ముక్తుడయ్యాడు. కూర్చున్నా-పడుకున్నా, ఎక్కడున్నా "నమో నారాయణాయ" అనే మంత్రం శరణ్యమని ఎవరు భావిస్తారో వారికి మంత్రఫలం లభించడం వాస్తవం."ఓం రామాయ" అన్నప్పుడు, ప్రణవం రామాయ అనడానికి విశేషణంగా గ్రహించాలి. శ్రీరామ షడక్షర మంత్రం మోక్ష సాధకులు మాత్రమే జపించాలనీ, ఐహిక కాంక్ష కలవారు ఆపదల్లో ఉచ్చరించరాదని, ఆంజనేయుడు రామ రహస్య ఉపనిషత్తులో అన్నట్లు చెప్తారు.
    తక్కినవారందరు "రామాష్టాక్షరి" జపించడం మంచిది కాబట్టి, రామ భక్తులందరూ "శ్రీరామాయ నమ" అని కాని, "రాం రామాయ నమ" అని కాని, "రామాయ నమ" అని కాని, "రామ" అని కాని జపించవచ్చు. శ్రద్ధాభక్తులకొలది ఫలమందరికీ సమానమే."రామ" అనే రెండక్షరాలలోనే సర్వ శక్తులున్నాయి. అందుకు వాల్మీకే సాక్షి."శ్రీం రామాయ నమ" అని జపించేవారు, ఈశ్వర యుక్తయై, దుఃఖాలను హరించి, తుష్టిని-సంపత్తును కలిగించమని శ్రీదేవిని ధ్యానం చేయాలి.
    శ్రీమద్రామాయణమంతా ప్రణవార్థాన్నే చెపుతుంది. రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమహవిష్ణువని వాల్మీకంటాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంత, సుగ్రీవ, విభీషణులు తాము దాసులమనే చెప్పుకుంటారు. దాసత్వం తమ స్వరూపమని తెలుసుకున్నవారందరు బాగుపడ్డారు. అది మరిచిన రావణాది రాక్షసులందరు అహంకారంతో చెడిపోయారు. సీతాదేవి పురుషకారాన్ని తెలుసుకున్న కాకాసురుడు బ్రతికి పోయాడు-తెలుసుకోలేని మూఢుడు రావణాసురుడు హతమయ్యాడు.
                                                                                      రేపు తరువాయి భాగం....

Related Posts