YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                               సర్గ-4

                    విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం

 లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో, భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో, ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి ప్రకటించినవారు కుశ లవులు. ఇంత గొప్ప బృహత్తర గ్రంథాన్ని రచించిన వాల్మీకి, ఓపిగ్గా దీన్నంతా కంఠంస్థం చేయగల శక్తిమంతులు ఎవరన్నా వున్నారానని ఆలోచించసాగాడు.
సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు
బాల కాండ        ౭౭    (77)    సర్గలు        ౨౨౫౬ (2256)    శ్లోకాలు
అయోధ్య కాండ        ౧౧౯  (119)    సర్గలు        ౪౪౧౫ (4415)    శ్లోకాలు
అరణ్య కాండ        ౭౫   (75)    సర్గలు        ౨౭౩౨    (2732)    శ్లోకాలు
కిష్కింధ కాండ        ౬౭   (67)    సర్గలు        ౨౬౨౦    (2620)    శ్లోకాలు
సుందర కాండ        ౬౮  (68)    సర్గలు        ౩౦౦౬    (3006)    శ్లోకాలు
యుద్ధ కాండ        ౧౩౧ (131)    సర్గలు        ౫౯౯౦    (5990)    శ్లోకాలు
ఉత్తర కాండ        ౧౧౦ (110)    సర్గలు        ౩౨౩౪    (3234)    శ్లోకాలు
--------------------------------------------------------------------------------
ఏడు కాండలు        ౬౪౭ (647)    సర్గలు    ౨౪,౨౫౩ (24,253)    శ్లోకాలు
ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు ప్రతిపాద్యుడిగా వుండడం, మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని "ప్రబంధ వైలక్షణ్య" మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి చరిత్రై నందువల్ల, రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం.
(స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని చెప్పడం జరిగింది. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా (మొదటి)ఈ క్రిందిపద్యంలో చెప్పడం జరిగింది).

సీ:    భువనావనార్థంబు భూమిపై జన్మించి, ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము
    డోముచు నుండ లోకోపకారంబుగ, భగవంతు డగు ఋషి వాల్మికుండు
    శ్రీరాము చరితంబు చిత్రపదంబుల, వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక
    సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను, పూర్వరామాయణ మనను నూరు
తే:    లేను, కాండంబులారుగ  జానుమీర, వెండియునుబల్కె  బదపడి కాండమొండు
పావనంబై న రఘురాము భావికథను, సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.
ఇలా ఆలోచిస్తున్న వాల్మీకి వద్దకు అసమాన బుద్ధి-చమత్కారాలున్న ఇద్దరు బాలురు వచ్చారు. ముని వేషాలు ధరించిన వారిరువురు, వాల్మీకికి మిక్కిలి భక్తితో నమస్కరించి, తామీ గ్రంథాన్ని సమగ్రంగా ముఖస్థం చేస్తామని అంటారు. క్షత్రియ జాతి బాలురైన ఆ ఇద్దరు, చంద్రుడిలాగా తెల్లటి కీర్తితో ప్రకాశిస్తున్నారు. గురు శుశ్రూషా ధర్మం చక్కగా తెలిసిన వారిలా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశిస్తుండె విష్ణు తేజం లాంటి కోల్పోని తేజముంది వారిరువిరిలో. వారుండేది వాల్మీకి ఆశ్రమంలోనే. చక్కని మేధ, సామగాన విద్యల్లో ఎవర్నైనా జయించి కీర్తి పొందగలిగే శక్తి-సామర్థ్యాలు, చలించని వేద మార్గం, నిష్ఠ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వారిలో. కుశ-లవులనే పేర్లున్న ఆ బాలురు-అన్న తమ్ములు, తనకు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడగానే, వారిని గమనించిన వాల్మీకి, వేదార్థాన్ని విశదపరిచే తన ఉత్తమ కావ్యాన్ని-దాని యోగ్యతకు తగ్గట్టే పఠనం చేయగల యోగ్యులు, సమర్థులు, వీరేనని నిర్ణయించుకుంటాడు. (యోగ విద్యను మేధావులు-నియతాత్ములైన వారికే ఇవ్వాలి. అయోగ్యులకు ఇవ్వకూడదు. అయోగ్యులు రామాయణం చదివి వ్యక్తం చేస్తున్న భావాలు-దురాపేక్షలు అందరికీ తెలిసినవే).ఎన్నో వ్రతాలను చేసినందువల్ల అత్యధికమైన జ్ఞానాన్ని, మహిమలను సంతరించుకున్న వాల్మీకి మహర్షి, రావణ వధ అనే నెపంతో, ప్రసిద్ధమైన వాక్యాలను వున్నదున్నట్లుగా, సీతామహాచరిత్రగా రచించాడు రామాయణాన్ని. అదొక మహాకావ్యం-గ్రంథం అయింది.
(గ్రంథాలు మూడు రకాలు. ప్రభు సమ్మిత శబ్ద ప్రధానమైంది మొదటి రకం - అంటే, శబ్దాల ఆడంబరంతో రాజులాగా ఆజ్ఞాపించేది. ఇక రెండో రకం సుహృత్సమ్మిత అర్థ ప్రధానమైంది - అంటే, స్నేహితుడివలె బోధించేది. కాంతా సమ్మిత వ్యంగ్య ప్రధానమైంది మూడో రకం - అంటే, వ్యంగార్థమే ప్రధానంగా వుండి, ప్రియురాలివలె మనస్సుకు నచ్చచెప్పి చేయించేది. రామాయణం అర్థ ప్రధానమై ఇతిహాసంగాను - వ్యంగ్య ప్రధానమై కావ్యంగాను ప్రసిద్ధి పొందింది. రామాయణాన్ని సీతా మహా చరిత్ర అంటాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చరిత్రకంటే, సీతాదేవి చరిత్ర ఉత్కృష్టమైందని దానర్థం. కౌసల్యా గర్భ సంభూతుడు రాముడు. అయోనిజ సీత. తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవులకు వెళ్లినవాడు రాముడు. ఎవరి బలవంతం లేకపోయినా, కేవలం పతిభక్తితో అడవులకు పోయింది సీత. కష్ట కార్యాలు చేసినందువల్ల గట్టి దేహం కలవాడు రాముడైతే, ఎండకన్నెరుగని సుకుమారి సీత. స్వతంత్రుడై, శక్తుడై, తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా, అశక్తిగా, ఒంటరిగా దుఃఖ పడింది సీత. భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత. కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందువల్లనె రామాయణాన్ని సీతా మహాచరిత్రమంటాడు వాల్మీకి మహర్షి).
వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం చదివినా, విన్నా, పాడినా వీనులకింపై-మనస్సుకు సంతోషకరమై-శుభకరమై వుంటుంది. ద్రుతం-మధ్యం-విలంబితం అనే కాలాల ధ్వని-పరిచ్ఛేదాలతో నిండిన పాటలకు అనువైన కావ్యమిది. "స-రి-గ-మ-ప-ద-ని-స" (షడ్జం-ఋష్ట్రభం-గాంధారం-మధ్యమం-పంచమం-దైవతం-నిషాదం, అనే సప్త స్వరాల సంజ్ఞాక్షరాలు) అనే స్వరాలతో-జాతులతో బంధించబడినదై, గాన లోపాలు లేనిదై, వీణపై వాయించేందుకు అనువైనదై, తాళాలకు-లయకు సరిపోయిందై అలరారుతుందీ కావ్యం. శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, శాంతి, అద్భుత, భయానక, బీభత్స అనే నవరసాలతో నిండినదైనప్పటికీ, శృంగార రసమే ప్రధానంగా వున్న మనోజ్ఞమైన కావ్యం రామాయణం. ఇంత గొప్పదైన రామాయణాన్ని గానం చేసేందుకు అనువైన రీతిలో కుశ లవులకు నేర్పించాడు వాల్మీకి. శ్రీరామచంద్రుడి ప్రతిబింబాలనదగిన కుశ లవులు గాన విద్యలో సమర్థులు.ఆ బాలురు సుందరమూర్తులు- మంద్ర, మధ్య తారల స్వరాల విషయాలను తెలిసిన వారందరిలో అగ్రగణ్యులు. ఇంపైన కంఠ స్వరమున్న వారు. మనోహరంగా మాట్లాడగలరు. నాటక లక్షణ శాస్త్రం చక్కగా తెలిసిన వారు. (కుశ లవులకు రామాయణం వాల్మీకి నేర్పడం కాకుండా, స్వయంగా కంఠస్థం చేసి సభల్లో పాడగల నైపుణ్యం వుంది).
అయోధ్యలో రామాయణాన్ని గానం చేసిన కుశ లవులు
ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో, వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గానం చేస్తున్న వారి సొంపు-గానం-ఇంపు-కథ పెంపు, వెరసి కర్ణ రసాయనంగా వినడం వల్ల, శ్రోతల కళ్ల నుండి ఆనంద భాష్పాలు జల-జల రాలాయి. రామచంద్రమూర్తి చేస్తున్న అశ్వమేధ యాగం చూడడానికి వచ్చిన మునీశ్వరులందరు కుశ లవులు గానం చేస్తున్న రామాయణాన్ని విని, ఆశ్చర్యపడి, సంతుష్ట మనస్కులయ్యారు. ముని కుమారుల వేషంలో, మనోహర సుందరకారంలో, సంగీత విద్యలో శ్రేష్ఠులై వున్న కుశ లవులను, మునీశ్వరులు మేలైన మాటలతో మెచ్చుకున్నారీవిధంగా: " ఆ హాహా, ఏమీ పాటల నీటు ! అరే ఏమీ పద్యాల హృద్యత ! సెబాసు ! ఏమీ అర్థపుష్ఠి ! ఔరా, ఏమి చిత్రం ! ఎంత కాలం క్రితం జరిగిన సంగతి? వీళ్లిప్పుడు పాడుతుంటే, ఇప్పుడే జరుగున్నట్లుందే ! ఏం ఆశ్చర్యం". (ఇది జరిగినప్పుడు శ్రీరాముడికి 54-55 సంవత్సరాల వయస్సుంటుంది. సీతాదేవికి 47-48 సంవత్సరాలుంటాయి. వాల్మీకి ఆశ్రమంలో విడిచి పెట్టినప్పుడు సీత వయస్సు 34సంవత్సరాలు).
వాల్మీకి తమలాంటి ఋషే ఐనప్పటికి, ఆయన రచించినగ్రంథాన్ని, ఏ మాత్రం అసూయపడకుండా, మునీశ్వరులందరూ ముక్త కంఠంతో పొగిడారు. ఎవరికి వారే మేలు-మేలని స్తుతించారు. వారిస్తున్న ప్రోత్సాహంతో ఉప్పొంగి పోయిన కుశ లవులు, స్వరం-లయ-గ్రామం-మూర్ఛనలతో రక్తికట్టిస్తూ, వినే వాళ్లు పరవశించే విధంగా, మనోహరంగా మళ్లీ - మళ్లీ పాడారు. విని సంతోషించిన మునులు వారికెన్నో బహుమానాలిచ్చారు. కొందరు చిత్రాసనాలిస్తే ఇంకొందరు జంద్యాలిచ్చారు. మోంజిలు, పాత్రలు, కమండలాలు, దండాలు, ఇతరత్రా ప్రియమైన వస్తువులెన్నో ఇచ్చారు మునులందరూ. ఏమీ ఇవ్వలేనివారు దీర్ఘాయుష్యులు కమ్మని దీవెనలిచ్చారు. (ఇవన్నీ బహుమానాలే కాని, దానాలు కావు. భగవత్ కథలు, పురాణాలు చెప్పేవారు ప్రతి ఫలాపేక్ష లేకుండానే చెప్పాలి-వినేవారు మాత్రం వారిని సత్కరించాలి). గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. పాడుతున్న బాలకులు, నెత్తిపై ముందున్న వెంట్రుకలను ముడేశారు - వెనుకనున్న వెంట్రుకలను జారవిడిచారు. పౌర్ణమి నాటి చంద్రుడిని బోలిన ముఖంపైన గోపీ చందనాన్ని రేఖగా దిద్దారు. ఎడమ భుజంపైన వీణ దండాన్ని-ఎడమ చేతిలో సొరకాయ బుర్రను వుంచారు. మెడలో ఒంటి జంద్యముంది. నడుంపైన చిన్న నార వస్త్రం చుట్టారు. లేత కుడిచేతి వేళ్ళతో వీనతంత్రులను మీటుతూ, మనోహరమైన రాగాలతో కాలం-తాళం తప్పకుండా, వాడ-వాడ తిరుగుతూ, రామాయణ గానం చేశారు కుశ లవులు.
(వీణలు రెండు రకాలు. శ్రుతి వీణ, స్వర వీణ. 22 శ్రుతులకు ఉపయోగించేది శ్రుతి వీణ. సప్త స్వరాలకుపయోగించేది స్వర వీణ. ఏక తంత్రికి బ్రహ్మ వీణన్న పేరుంది. రెండు తంత్రులుంటె నకులం అంటారు. విపంచికి ఇరవై ఒక్కటుంటాయి. మత్తకోకిలం, స్వర మండలం, ఆలాపిని, కిన్నరి, పినాకి, పరివాదిని, నిశ్శంక గా మరి కొన్నిటిని పిలుస్తారు. సరస్వతి వీణను కచ్ఛపి అని, నారదుడి వీణను మహతి అని, తుంబురుడి వీణను కళావతి అని, విశ్వావసు వీణను బృహతి అని అంటారు).
అయోధ్యలోని యజ్ఞ శాలలో వున్న జనులు-మునులు అందరూ, వాల్మీకి రచించిన కావ్యం గురించి-దాని మహిమ గురించి-శ్రేష్ఠత గురించి, వీధి-వీధిలో చెప్పుకోవడం జరిగింది. ఆ మహర్షి ఎంతటి మహిమాన్వితుడో కదా అని ఆయన్ను పొగడసాగారు. భావితరాల కవీశ్వరులు రచించబోయే కవితలకు-కావ్యాలకు వాల్మీకి రామాయణం ఆధారమౌతుందని, రాగాలకు యోగ్యమైనదిగా భావించబడుతుందని, ఓపికగా వినేవారి చెవులకు అమృత ధార అవుతుందని, చదివినవారి ఆయువు వృద్ధి చెందుతుందని పొగడ్తలతో దాన్ని గురించి చెప్పసాగారు. సముద్రంలో వున్న రత్నాలలాగా, రామాయణంలో వున్న సద్గుణాలు అనంతమని, నవరసాలకు నిలువ నీడైనదని, వ్యాధులను వుపశమించే దివ్యౌషధమని, ఆత్మ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుందని పొగిడారు దాన్ని. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.
రామాయణం గానం చేస్తున్న కుశ లవులను పిలిపించిన శ్రీరాముడు
ముని కుమారుల వేషాలను ధరించి మన్మధా కారులై-చంద్ర బింబం లాంటి ముఖం వున్నవారై- అత్యంతతేజస్సుతో అలరారుతూ-చక్కగా రాజవీధుల్లో గానంచేస్తున్న కుశలవులను, సూర్య తేజస్సుతో ప్రకాశించే శ్రీరామచంద్రమూర్తి,తన ఇంటికి పిలిపించుకుంటాడు.ఆ సమయంలో కుశ లవులు, నల్లని తుమ్మెదలను మించిన ముంగురులతోను,లేత చంద్రుడితో పోల్చదగే నొసలుతోను,శరీరకాంతితోను మెరిసి పోతుంటారు.తన తమ్ములు, ఇతర సామంత రాజులు, మంత్రులు, మరెందరో తను కూర్చున్న బంగారు సింహాసనం చుట్టూ చేరి, తనకు సేవలు చేస్తున్న సమయంలో, కుశ లవులనుద్దేశించి " నాయన లారా, మీరేదో పాడుతున్నారే ! దానిని నేనూ వింటాను" అని అంటాడు శ్రీరాముడు. మన్మధాకారంగల ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకేరకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, నీతిమంతుడైన శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు.
(రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై, కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా వస్తుంటాయో, అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు బ్రహ్మానందం కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం).
కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు. ఆలాపాల, రాగాల తీయ దనంతో, ప్రవాహంలాగా రామాయణ గానం చేస్తున్న బాలకుల ప్రతిభను గమనిస్తున్న వారంతా, ఆ రసాస్వాదనలో మునిగి తేలుతూ, ఇంకా తనివితీరా వింటే బాగుంటుందని భావిస్తూ పరవశులై పోతుంటారు. కుశ లవుల గాన మాధుర్యాన్ని-మనోహరత్వాన్ని ఆస్వాదించడమే కాకుండా, పాటకు సంబంధించిన కథలోని విశేషాన్ని కూడా గమనించాలని, శ్రోతలనుద్దేశించి అంటాడు శ్రీరాముడు. ఆయనలా మాట్లాడడంతో, కుశ లవులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తేనెలో చక్కెర కలిపితే, తీపి దనం ఎలా పెరుగుతుందో, అలానే, భగవత్ కథలో తీయదనం కలిగిస్తున్న కుశ లవులు బాలకులైనప్పటికీ, భగవత్ కథను చెప్తున్నందున, వారికంటే ఉన్నత స్థానంలో తను కూర్చోడం భావ్యం కాదని తలచిన శ్రీరాముడు, సందడి చేయకుండా బంగారు సింహాసనం మీదనుండి దిగి, అక్కడున్న నలుగురి మధ్య ఒకడిగా కూచుంటాడు. దీంతో మరింత సంబరపడిన కుశ లవులు, అసలు-సిసలైన సంగీత విధానంలో రామ చరిత్రనంతా గానం చేశారు.
("తపమున స్వాధ్యాయంబున.. ... .. " అనే పద్యంతో ఆరంభమై, ఇంతవరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం లాంటిది. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా అంతర్భాగాలో, రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే మూడు ప్రధాన విషయాలను, రామాయణం చదివే వారికి-దానిపై గౌరవం కలించేందుకు, ఈ ఉపోద్ఘాతం లో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ వృత్తాంతమంతా ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో చెప్పడం జరిగింది.దాన్నే పాఠకులకు సంక్షిప్తంగా ముందుగానే వివరించడం జరిగింది.మొదటి మూడు సర్గల్లో స్వవిషయం గురించి, తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు వాల్మీకి ఆత్మ స్తుతిగా ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో "గ్రంథోత్పత్తి" గురించి చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.
బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతుని అర్థం చేసుకోవాలి. భగవంతునందు చేసిన శరణాగతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగ కాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణా గతికి పురుష కారం అవశ్యం. పురుషకారానికి కావాల్సిన ముఖ్యగుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుషకారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్యవలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది.శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే).

                                                           రేపు తరువాయి భాగం....

Related Posts